ఆ అధికారితో పవన్ కల్యాణ్ భేటీ: ఎవరా అధికారి?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కేసుల్లో అత్యంత వేగంగా స్పందించి, జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న అధికారి లక్ష్మీనారాయణ కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయనతో పవన్ కల్యాణ్ రెండు సార్లు అత్యంత రహస్యంగా భేటీ అయినట్లు కూడా ప్రచారం సాగుతోంది.
జగన్ను టార్గెట్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కాస్తా మెతగ్గా ఉంటూ రాజకీయాల్లో దూసుకుపోవాలనే ఎత్తుగడలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ తనకూ చంద్రబాబుకు మధ్య మాత్రమే ఉండాలనేది కూడా ఆయన వ్యూహమట. నిజాయితీపరుడిగా పేరు సంపాదించుకున్న లక్ష్మినారాయణ తన వెంట ఉంటే ప్రయోజనం చేకూరుతందని పవన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాపు సామాజిక వర్గానికి చెందిన తమ పార్టీ ప్రముఖులను కూడా జనసేనలో చేర్పించే ప్రణాళికలో ఉన్నారని, ఈమేరకు పలువురు నేతలతో ఆయన టచ్లో ఉన్నారనే సమాచారం తమకు ఉందని బిజెపి వర్గాలు పవన్ కల్యాణ్ గురించి వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే, వచ్చే ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం పార్టీలు కలిసి ముందుకు సాగుతాయని భావిస్తున్న తరుణంలో బిజెపి అంచనాలు మరో విధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తమ పార్టీని విమర్శిస్తున్నారని, విభజనలో టిడిపి సహా అన్ని పార్టీల పాత్ర ఉండగా పవన్ కేవలం తమ పార్టీనే లక్ష్యంగా చేసుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని బిజెపి నాయకులు భావిస్తున్నారు. విభజనకు తెలుగుదేశం పార్టీ రెండుసార్లు లేఖ ఇవ్వడంతో పాటు నాటి ముఖ్యమంత్రి రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బిల్లు పెడితే తాము మద్దతు ఇస్తామని చెప్పిన విషయాన్ని ప్రస్తావించడం లేదని అంటున్నారు.
టిడిపి ఎంపీలను విమర్శిస్తున్న పవన్ కల్యాణ్ పార్టీ విధానాన్ని నిర్దేశించే అధ్యక్షుడు చంద్రబాబును మాత్రం ఏమీ అనడం లేదని, దీనివల్లనే తమకు అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. తిరుపతి, కాకినాడ సభల్లో పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాపై పూర్తిగా తమదే తప్పు అన్నట్లుగా మాట్లాడారని అంటున్నారు. ఈ నెల 10వ తేదీన అనంతపురం సభలో పవన్ కల్యాణ్ చెప్పే విషయాలు దానిపై మరింత స్పష్టత ఇస్తాయని అంటున్నారు.