తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడికి చేదు, ఎస్పీ జయలక్ష్మి ఆగ్రహం
చిత్తూరు: శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనకు ఆదివారం నాడు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం చేదు అనుభవం ఎదురైంది. ఆయన కలియగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన బయటకు వచ్చారు.
ఈ సమయంలో అధికారుల సమన్వయ లోపం కారణంగా ఆలయం ఎదుట పది నిమిషాలకు పైగా వేచి చూడవలసి వచ్చింది. ఆయన బయటకు వచ్చిన సమయంలో, తాను ప్రయాణించే వాహనం డ్రైవర్ లేకపోవడంతో ఆయన వేచి చూశారు.
ప్రొటోకాల్ ప్రకారం సిరిసేనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఆయనతో వచ్చిన సిబ్బందికి వెంటనే దర్శనం కల్పించలేదు. దీంతో స్వామి దర్శనానికి వెళ్లిన సిరిసేన డ్రైవర్ క్యూలైన్లోనే ఆగిపోయాడు. డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వేచి చూడాల్సి వచ్చింది.

ఓ దేశాధ్యక్షుడు వేచి చూసేలా చేసిన ఆలయ అధికారుల తీరుపై ఆయన భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అర్బన్ ఎస్పీ జయలక్ష్మి మండిపడ్డారు. అక్కడే ఉన్న ఆలయ డిప్యూటీ ఈఓపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసుల మధ్య సమన్వయం కొరవడిందని, వెంటనే డ్రైవర్ను బయటకు తీసుకు వచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం దర్శనం ముగించుకుని డ్రైవర్ బయటకు వచ్చాక.. సిరిసేన కాన్వాయ్ ముందుకు సాగింది.
కాగా, శనివారం రాత్రి కొండ పైకి చేరుకున్న సిరిసేన ఆదివారం వేకువజామున శ్రీవారి సుప్రభాతసేవలో పాల్గొన్నారు. టిటిడి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. సిరిసేన పర్యటన నేపథ్యంలో తిరుమలలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications