తిరుమల:కెసిఆర్ ఆఫీస్ లేఖ రాసినా పట్టించుకోవట్లేదు
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే తెలంగాణ భక్తుల వసతి సౌకర్యాలు, సమస్యల పైన అధ్యయనం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం సిఫార్సు లేఖలను కూడా పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.
తెలంగాణ సీఎం ఆఫీస్తో పాటు మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు భక్తులకు ఇచ్చిన సిఫార్సు లేఖలను కూడా పట్టించుకోవడం లేదని, వసతి సౌకర్యాలు, దర్శనం కల్పించడం లేదని ముఖ్యమంత్రి కార్యాలయానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తిరుమల వెళ్లే తెలంగాణ భక్తుల వసతి సౌకర్యాలు, సమస్యలపై అధ్యయనం చేయాలని కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశానికి ఈ బాధ్యతలు అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతికి వెళ్లి అక్కడి పరిస్థితులు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. లేఖల తిరస్కరణతో భక్తుల ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు అక్కడి ఈవో, జేఈవో కార్యాలయాలకు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదట.
తమకు తగిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని మంత్రులు, శాసనసభ్యులు, మండలి సభ్యులు, అధికారులు ముఖ్యమంత్రి కెసిఆర్కు ఫిర్యాదు చేశారు. వీటిపై సీనియర్ ఐఏఎస్ అధికారి ద్వారా విచారణ జరిపించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ యాత్రికులు, పర్యాటకుల ఆతిథ్యం వంటి వాటిపై సమగ్ర నివేదికివ్వాలని సూచించారు.