గ్రేట్ : 32 వేల ఏళ్ల క్రితమే మరణించింది.. అయినా బతికించారు
దాదాపు 32 వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఓ మొక్కను తిరిగి భూమ్మీద మొలకెత్తేలా చేశారు సైబీరియా శాస్త్రవేత్తలు.
సైబీరియా: మరణించిన వారికి తిరిగి ప్రాణం పోసే పరిశోధనలు ప్రపంచంలో కొన్ని చోట్ల జరుగుతున్నాయి. మన దేశంలో కూడా గత ఏడాది ఓ రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పిన సంజీవనిని కనుగొనడానికి కొంత మొత్తంలో నిధులను కూడా కేటాయించింది.
చాలా ఏళ్ల క్రితం మరణించి ఇంకా మిగిలి ఉన్న జీవుల డీఎన్ఏ కణాలతో ప్రాణం ఉన్న జన్యువులను కలిపి తిరిగి వాటిని సృష్టించే ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిశోధనలే నిర్వహిస్తున్న రష్యా ఈ దిశగా ఒకడుగు ముందుకేసింది.
దాదాపు 32 వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఓ మొక్కను తిరిగి భూమ్మీద మొలకెత్తేలా చేశారు సైబీరియా శాస్త్రవేత్తలు. ఈ మొక్క పేరు సైలిన్ స్టెలోఫిల్లా. సైబీరియాలోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెల్ బయోఫిజిక్స్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు.
తమ పరిశోధనల్లో భాగంగా కోలైమా నది పరివాహక ప్రాంతంలో చనిపోయిన జీవుల జన్యువుల కోసం అన్వేషిస్తున్న సమయంలో నదికి దగ్గరలోని ఓ ప్రాంతంలో మంచు దిబ్బల కింద ఓ ఉడుత తన ఆహారం కోసం దాచుకున్న చిన్న గింజ ఓ పరిశోధకుడికి కనిపించింది.
ఆ గింజతో టెస్ట్ ల్యాబ్ కు చేరుకున్న పరీక్షించగా.. అది 32 వేల సంవత్సరాల క్రితం భూమ్మీద జీవించిన సైలిస్ స్టెలోఫిల్లా అనే గడ్డి మొక్కకు చెందిన గింజ అని తెలిసింది. సైలిన్ స్టెలోఫిల్లా ప్రస్తుత ప్రపంచంలో కూడా ఉంది.
అయితే కాలాంతరంలో దాని జన్యువుల్లో భారీ మార్పులు జరిగాయి. దీంతో ఆ గింజను మొలకెత్తించి వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన ఆ మొక్కను తిరిగి మొలిపించాలని నిర్ణయించుకున్న పరిశోధకులు.. అందులో సఫలమయ్యారు.
రష్యా శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయం మరణించిన జంతువుల జన్యువులను ప్రాణం ఉన్న డీఎన్ఏ జన్యువులతో కలిపి అంతరించిపోయిన జంతువులను తిరిగి భూమ్మీద సృష్టించే అవకాశాలను, ఆశలను చిగురింపజేస్తోంది. ఏమో ఎవరు చెప్పగలరు? అంతరించిపోయిన రాక్షస బల్లులు, గండభేరుండ పక్షులను తిరిగి మనం భూమ్మీద చూస్తామేమో?