అసంతృప్తిలో బాబు?.. ఏంటా సర్వే!: ఎందుకంత టెన్షన్..
ఇంటలిజెన్స్ సర్వే ఫలితాలపై సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ నాయకుల అవినీతి గురించి తాజా సర్వేలో పలు విషయాలు వెల్లడవడంతో..
చిత్తూరు: పార్టీ బలబలాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు సర్వే మంత్రాన్ని ఎప్పుడూ జపిస్తూనే ఉంటారు. పార్టీ పట్ల ప్రజల్లో సదాభిప్రాయం సడలుతుందా? ప్రతికూల పరిస్థితులేమైనా ఏర్పడుతున్నాయా? వంటి అంశాలను ఆయన ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో సర్వే రిపోర్టుల్ని తెప్పించుకుని పార్టీ వ్యూహాలకు పదునుపెడుతుంటారు.
అయితే ఇటీవలి కాలంలో తన సొంత జిల్లా చిత్తూరుకు సంబంధించి ఇంటలిజెన్స్ వర్గాలు ఇస్తున్న రిపోర్టుల పట్ల సీఎం చంద్రబాబుకు నమ్మకం కుదరట్లేదట. పార్టీ తరుపున చేయించిన సర్వేలకు, ఇంటలిజెన్స్ సర్వేకు ఎక్కడా పొంతన కుదరకపోవడంతో.. సర్వే ఫలితాలు నిజమేనా? కాదా? అన్న మీమాంసలో పడ్డారట.
గతంలో పార్టీ తరుపున చేయించిన సర్వేలో నాలుగు సీట్లు మాత్రమే టీడీపీ ఖాతాలో చేరుతాయన్న సంకేతాలు రాగా.. తాజా ఇంటలిజెన్స్ సర్వేలో జిల్లావ్యాప్తంగా పార్టీకి అనుకూల ఫలితాలే వచ్చాయట. దీంతో సర్వేలో నిజమెంత? అన్న దానిపై అంతర్గత చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవిధంగా ఈ వ్యవహారం అధిష్టానాన్ని గందరగోళానికి గురిచేస్తుందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
కాగా, జిల్లాలోని నియోజకవర్గాల్లో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? సమస్యల పరిష్కారానికి ఎంతమేర చొరవచూపిస్తున్నారు? ఎన్ని రోజులకొకసారి గ్రామాల్లోపర్యటిస్తున్నారు? ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారా? వంటి అంశాల ప్రాతిపదికగా టీడీపీ సర్వే జరిగినట్లు సమాచారం.
సీఎం అసంతృప్తి:
ఇంటలిజెన్స్ సర్వే ఫలితాలపై సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ నాయకుల అవినీతి గురించి తాజా సర్వేలో పలు విషయాలు వెల్లడవడంతో.. ఈ వ్యవహారం పార్టీకి నష్టం చేకూర్చేదిగా ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల విషయంలోను చేతులు తడపనిదే పని జరగట్లేదంటూ ప్రజలు వాపోతున్న విషయాలు కూడా తాజా సర్వేలో వెల్లడైనట్లు సమాచారం. జన్మభూమి కమిటీ నాయకులతో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత గూడుకట్టుకున్నట్లు తాజా సర్వేలో వెల్లడయిందని చెబుతున్నారు.