మర్మాంగానికి రబ్బర్ బ్యాండ్ వేసి..: కుమారుడిపై ఓ తండ్రి ఘాతుకం
రోజు రాత్రి పక్క తడుపుతున్నాడన్న కారణంగా 5ఏళ్ల కుమారుడి మర్మాంగానికి రబ్బర్ బ్యాండ్ వేశాడు.
బెంగళూరు: తల్లి లేని పిల్లలు ఎంతటి నిరాదరణకు, అభద్రతకు గురవుతారో తెలియజెప్పే ఘటన ఇది. తండ్రిగా పిల్లల పట్ల ఎంతో ఓపిగ్గా వ్యవహరించాల్సింది పోయి ఓ తండ్రి అమానుషానికి పాల్పడ్డాడు. నిద్రలో మూత్రం పోస్తున్నాడన్న కారణంతో.. అతని జననాంగానికి రబ్బర్ బ్యాండ్ వేసి వేధించాడు.
కర్ణాటకలోని మైసూర్ జిల్లా పిరియా పట్టణంలో గురువారం ఈ ఘటన వెలుగుచూసింది. నంజనాయక అనే ఓ తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇతని భార్య కొద్దిరోజుల క్రితం మృతి చెందడంతో ఇద్దరు పిల్లల బాధ్యతను ఇతనే చూసుకుంటున్నాడు. కుమార్తె(8), కుమారుడు(5)లతో కలిసి పిరియా పట్టణంలో నివసిస్తున్నాడు.
కుమారుడు పదేపదే నిద్రలో మూత్రం పోస్తుండటంతో నంజనాయక విసుగుచెందాడు. ఇలా జరగకుండా ఉండాలంటే అతని మర్మాంగానికి రబ్బర్ బ్యాండ్ వేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే ఆ పని చేయడంతో బాలుడు కొద్దిరోజులుగా అస్వస్థతకు గురవుతూ వస్తున్నాడు.
స్థానిక అంగన్ వాడీకి బాలుడు వెళ్తుండటంతో.. అక్కడి మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు దీన్ని గుర్తించారు. అతని మర్మాంగానికి రబ్బర్ బ్యాండ్ వేసి వేధింపులకు గురిచేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోస్కో చట్టం కింద నంజనాయకపై కేసు నమోదైంది. గత వారం రోజులుగా తన మర్మాంగానికి తండ్రి రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాడని బాలుడు చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా, భార్య బతికి ఉన్నప్పుడే తాగుడుకు బానిసైన నంజనాయక.. ఆమెను తీవ్రంగా వేధించేవాడు. తాగొచ్చి భార్య పిల్లలను కొట్టేవాడు. కొంతకాలానికి భార్య మృతి చెందడంతో నంజనాయక ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. పిల్లలను వేధిస్తుండటంతో.. బంధువులు వారిని అంగన్ వాడీ కేంద్రంలో వదిలేశారు.
ఇదే క్రమంలో ఇటీవల అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లిన నంజనాయక.. తాను పూర్తిగా మారిపోయానని, తన పిల్లలను బాగా చూసుకుంటానని, తనతో పంపించాలని కోరాడు. అతని మాటలు నమ్మిన అంగన్ వాడీ అధికారులు పిల్లలను పంపించారు. ఆపై కొద్దిరోజులకే ఇలాంటి ఘటన వెలుగుచూడటంతో నంజనాయకపై వారు ఆగ్రహంతో ఉన్నారు.