మళ్లీ ఇరుక్కున్న కాంగ్రెస్! తాలిబాన్ వ్యవస్థాపకుడితో చిదంబరం భేటీ! సంచలనం సృష్టిస్తున్న ఫొటో...
న్యూఢిల్లీ : తన అడ్డు తొలగించేందుకు కాంగ్రెస్ పాకిస్తాన్తో చేతులు కలిపిందంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తాలిబాన్ వ్యవస్థాపకుడితో ఉన్నటువంటి ఫొటో ఒకటి సోమవారం వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన అడ్డు తొలగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ వెళ్ళారంటూ ఆయన ఆరోపించారు.
మణిశంకర్ అయ్యర్, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రహస్యంగా పాకిస్తాన్ హై కమిషనర్తో భేటీ అయినట్లు వార్తలు రాగా.. తొలుత కాంగ్రెస్ ఆ వార్తలను ఖండించినా ఆ తర్వాత ధ్రువీకరించింది.
ఈ నేపథ్యంలో తాజాగా తాలిబాన్ నేతతో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఉన్న ఫొటో బయటపడింది. దీంతో తాలిబాన్తో కాంగ్రెస్కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దేశ భద్రతను పట్టించుకోకుండా 2013లో అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం తాలిబాన్ నేతతో సమావేశమయ్యారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఫొటోను బీజేపీ విదేశీ వ్యవహారాల ఇన్ఛార్జి విజయ్ చౌతాయ్వాలే ట్వీట్ చేశారు.
తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ సలామ్ జయీఫ్తో కలిసి చిదంబరం ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. 2001 వరకు తాలిబాన్ ప్రభుత్వానికి అధినేత అయిన ముల్లా ఒమర్కు అబ్దుల్ సలామ్ జయీఫ్ అత్యంత సన్నిహితుడు. జయీఫ్ 2005 వరకు గ్వాంటనామో బేలో జైలు జీవితం గడిపాడు.
చిదంబరం 2013లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. చిదంబరం, జయీఫ్ ఉన్న ఫొటో గోవా థింక్ ఫెస్టివల్లో తీసినదని తెలుస్తోంది. ఈ ఫెస్టివల్లో ఉపన్యాసం ఇచ్చేందుకు జయీఫ్తోపాటు చిదంబరంను ఆహ్వానించారని తెలుస్తోంది.
''2013లో చిదంబరం తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ సలామ్ జయీఫ్తో కలిసి కనిపించారు. తాలిబాన్ ప్రభుత్వ అధినేత ముల్లా ఒమర్కు జయీఫ్ అత్యంత సన్నిహితుడు. ఆయన 2005 వరకు గ్వాంటనామో బేలో నిర్బంధంలో ఉన్నాడు. మరో రుజువు దొరికింది..'' అని విజయ్ చౌతాయ్వాలే ట్వీట్ చేశారు.