డెడ్లైన్తో చిన్నమ్మకు దడ!: తిరగబడ్డ ఎమ్మెల్యే.. 'అవసరమైతే మరో శిబిరంలోకి'
సమస్యకు శాశ్వత పరిష్కారం గనుక చూపకపోతే చిన్నమ్మ శిబిరం నుంచి తప్పుకుని మరో శిబిరంలోకి వెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే కనకరాజ్ ప్రకటించారు.
చెన్నై: ఆర్కేనగర్ ఉపఎన్నిక దగ్గరపడుతున్న తరుణంలో అన్నాడీఎంకెలో మరోసారి లుకలుకలు బయటపడుతున్నాయి. ఓవైపు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నాలు కొనసాగుతుండగా.. మరోవైపు సొంత గూటి నేతల నుంచే అసంతృప్తి స్వరాలు వినిపిస్తుండటం ఆ పార్టీని కలవరపెడుతోంది.
తాజాగా సూళూరు ఎమ్మెల్యే కనకరాజ్ చేసిన ప్రకటన పార్టీలో అసమ్మతి సెగ రగులుతోందన్న సంకేతాలు జనంలోకి పంపించింది. ప్రస్తుతం అన్నాడీఎంకె పార్టీకి 122మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. ఇందులోంచి ఏ ఐదుగురు ఎమ్మెల్యేలు పక్కకు తప్పుకున్నా ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. దీంతో నేతల బెదిరింపులకు ప్రభుత్వం తలవంచక తప్పట్లేదు.

క్వారీ బాధితుల కోసం కదిలిన ఎమ్మెల్యే:
అసలు విషయానికొస్తే.. సూళూరు పచ్చపాళయంలో ఆనందకుమార్ అనే వ్యక్తికి చెందిన ఓ క్వారీ ఉంది. శుక్రవారం నాడు ఇక్కడ జరిగిన ప్రమాదంలో పళనికి చెందిన బాలన్, శక్తి వేలన్ అనే కార్మికులు తీవ్రంగా గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున చెల్లించి యాజమాన్యం పక్కకు తప్పుకుంది.

సీఎం చెప్పినా వెనక్కితగ్గను:
విషయం తెలిసిన ఎమ్మెల్మే కనకరాజ్ క్వారీ వద్దకు చేరుకుని బాధితుల గోడు విన్నారు. క్వారీ గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవాడే లేకపోయాడని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇకనుంచి తానెవ్వరికీ భయపడేది లేదని, అవసరమైతే సీఎం పళనిస్వామికి కూడా తాను భయపడనని తేల్చి చెప్పారు.

ప్రభుత్వానికి డెడ్ లైన్:
క్వారీని శాశ్వతంగా మూసివేసి, ఘటనకు బాధ్యులైన యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు 'ప్రభుత్వానికి పదిరోజుల డెడ్ లైన్ విధించిన ఎమ్మెల్యే కనకరాజ్.. ఆలోగా సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలు కోరుకునే శిబిరంలో చేరాల్సి ఉంటుందని' హెచ్చరికలు జారీ చేశారు.

చిన్నమ్మ శిబిరాన్ని వీడే యోచనలో:
సమస్యకు శాశ్వత పరిష్కారం గనుక చూపకపోతే చిన్నమ్మ శిబిరం నుంచి తప్పుకుని మరో శిబిరంలోకి వెళ్లడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే కనకరాజ్ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించడంతో ఆగమేఘాల మీద మంత్రి రాధాకృష్ణన్ ఆయన ఇంటికి చేరుకుని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యే ఎంతకీ వెనక్కి తగ్గని కారణంతో నిరాశతో ఆయన వెనుదిరిగారు. నేతల బెదిరింపులతో చిన్నమ్మకు కూడా భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది.

దీప వర్గంలోను అసమ్మతి:
చిన్నమ్మ శిబిరాన్ని వీడుతానని కనకరాజ్ సంకేతాలు పంపిచడంతో.. ఆయన్ను తమవైపుకు తిప్పుకోవడానికి పన్నీర్ సెల్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక నిన్నటిదాకా జయలలిత మేనకోడలి వర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సౌందరరాజన్ ప్రస్తుతం పన్నీర్ చెంతకు చేరారు. దీంతో ఆగ్రహించిన దీప మద్దతుదారులు ఆయన దిష్టి బొమ్మ దగ్గం చేశారు.












Click it and Unblock the Notifications