రేవంత్ రెడ్డికి షాక్: నారా బ్రహ్మణికి టిడిపి పగ్గాలు?
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారని ప్రచారం జరుగుతోంది.
Recommended Video
హైదరాబాద్: తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారని ప్రచారం జరుగుతోంది. అదే గనుక జరిగితే పార్టీని వీడిన రేవంత్ రెడ్డి షాక్కు గురి కాక తప్పదని అంటున్నారు.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి తన కోడలు నారా బ్రాహ్మణికి పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో పార్టీ కృంగి కృశించి పోతున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో ఆయన ఆ ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
నందమూరి బాలకృష్ణ కూతురు కావడం, దివంగత ఎన్టీ రామారావు మనవరాలు కావడం వల్ల ఆమెకు తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగిస్తే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.
ఎన్టీఆర్పై సానుకూల వైఖరి...
తెలంగాణలో ఎన్టీ రామారావు పట్ల ప్రజలకు సానుకూల వైఖరి ఉంది. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం వంటి కొన్ని కార్యక్రమాల వల్ల తెలంగాణ ప్రజలు ఆయన వల్ల ప్రయోజనం పొందారు. అందువల్ల ఆయన మనవరాలిగా నారా బ్రాహ్మణిని తెలంగాణ ప్రజలు ఆదరించే అవకాశం ఉందనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.
అదే మంత్రం...
పలువురు నాయకులు టిడిపిని వీడారు. ఆ స్థితిలో తెలంగాణలో పార్టీని బతికించుకోవాలంటే, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలంటే బ్రాహ్మణిని ముందు పెట్టడమే మార్గని అంటున్నారు. రేవంత్ రెడ్డి పార్టీని వీడిన నేపథ్యంలో తెలంగాణ పార్టీ పగ్గాలను బ్రాహ్మణికి అప్పగించాలని పార్టీ తెలంగాణ నాయకులు కోరినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నియమితులైన నేపథ్యంలో బ్రాహ్మణి తప్ప మరో మార్గం లేదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడే పుట్టి పెరిగి....
బ్రాహ్మణి హైదరాబాదులోనే పుట్టి పెరిగారు. గతంలో ఎనలేని ప్రజాదరణ కలిగి ఉన్న టిడిపి ఇప్పుడు దిక్కులేని పక్షిలా మారింది. బ్రాహ్మణి హెరిటేజ్ సంస్థ బాధ్యతలు చూస్తున్నారు. హైదరాబాదులోనే పుట్టి పెరిగారు కాబట్టి బ్రాహ్మణి స్థానికేతరురాలు అనే విమర్శలు రాబోవని భావిస్తున్నారు.
ఎపిలో తీసుకోలేదు...
నారా బ్రాహ్మణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకల్ స్టేటస్ తీసుకోలేదు. బ్రాహ్మణికి రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని అంటున్నారు. తాము ఎప్పుడు కలిసినా తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి అడుగుతుంటారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.