దారితప్పిన రైలు: మహారాష్ట్రకు వెళ్లాల్సింది మధ్యప్రదేశ్కు, ఏం జరిగిందంటే?
రోడ్డుపై వెళ్లే వాహనాలు, గాల్లో వెళ్లే హెలికాప్టర్లు, విమానాలు దారితప్పిన వార్తలు అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. కానీ, ఇక్కడ మాత్రం ఓ రైలు దారి తప్పింది.
ముంబై: రోడ్డుపై వెళ్లే వాహనాలు, గాల్లో వెళ్లే హెలికాప్టర్లు, విమానాలు దారితప్పిన వార్తలు అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. కానీ, ఇక్కడ మాత్రం ఓ రైలు దారి తప్పింది. ఏకంగా ఓ రాష్ట్రానికి బదులు మరో రాష్ట్రానికి వెళ్లింది. దీంతో అందులోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.
తలల పెట్టుకున్నారు..
మహారాష్ట్రకు వెళ్లాల్సిన ఓ రైలు దారి తప్పి మధ్యప్రదేశ్కు చేరుకుంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 1500 మంది రైతులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ర్యాలీ కోసం వచ్చిన రైతులు
దేశవ్యాప్తంగా ఉన్న రైతులు సోమవారం ఢిల్లీకి తరలివచ్చి జంతర్మంతర్ వద్ద కిసాన్ యాత్ర పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు మహారాష్ట్ర నుంచి 1500 మంది రైతులు ప్రత్యేక రైలులో వచ్చారు.
దారితప్పింది..
ఆందోళన ముగించుకుని తిరిగి మహారాష్ట్ర వెళ్తుండగా మార్గమధ్యంలో రైలు దారి తప్పింది. దీంతో 160 కిలోమీటర్లు వేరే మార్గంలో ప్రయాణించి మధ్యప్రదేశ్లోని బాన్మోర్ స్టేషన్ చేరుకుంది.
తప్పు ఎక్కడ జరిగిందంటే..
అయితే, మథుర స్టేషన్ వద్ద రైల్వే అధికారులు తప్పుడు సిగ్నల్ ఇవ్వడం వల్లే రైలు దారి తప్పిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఘటనపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఊరూ పేరు తెలియని ప్రాంతంలో ఇలా చిక్కుకుపోయామని.. ఇంత జరిగినా ఒక్క రైల్వే అధికారి కూడా ఇక్కడకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, గురువారం ఉదయం వరకు రైతులను సొంత ప్రాంతాల్లో చేరుస్తామని రైలు డ్రైవర్ తెలిపారు.