ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి: ఎవరితోనో తెలుసా?.. నీరవ్ మోడీకి బంధువే?
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ, రోజీ బ్లూ డైమండ్స్ అధిపతి రస్సెల్ మెహతా త్వరలోనే వియ్యంకులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముకేశ్ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, రస్సెల్ కుమార్తె శ్లోక మెహతా వివాహ బంధంతో త్వరలోనే ఒక్కటవబోతున్నారని సమాచారం.
గోప్యంగా ఉంచుతున్నారు:
పెళ్లిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నా.. రెండు కుటుంబాలు మాత్రం ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచుతున్నాయి. అయితే తేడాది డిసెంబర్ లోనే పెళ్లి విషయమై ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరిందని, మరికొద్ది వారాల్లోనే వీరి నిశ్చితార్థం ఉండవచ్చునని తెలుస్తోంది.
ఇద్దరూ కలిసే చదువుకున్నారు..:
ఆకాశ్, శ్లోక.. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. ముకేశ్ అంబానీ తొలి సంతానమైన కవలల్లో ఆకాశ్ ఒకరు. ఆకాశ్, అతని కవల సోదరి ఇషా ప్రస్తుతం 'జియో' బోర్డులో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
రోజీ బ్లూ డైరెక్టర్గా శ్లోక:
స్కూలింగ్ అనంతరం శ్లోక 2009లో ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఆంత్రోపాలజీ చదివారు. ఆపై 'లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్' నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. 2014నుంచి రోజీ బ్లూ ఫౌండేషన్ డైరెక్టర్గా ఉన్నారు.
నీరవ్ మోడీకి బంధువే?:
రస్సెల్, మోనా మెహతా ముగ్గురు పిల్లల్లో శ్లోక ఆఖరి సంతానం. రోజీ బ్లూ బాధ్యతలతో పాటు 'కనెక్ట్ ఫర్' అనే సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ లో ఇరుక్కున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ వీరికి బంధువే కావడం గమనార్హం.