ఆ షరతుతోనే కుతుహలమ్మ టిడిపిలోకి, 2019లో ఆ టిక్కెట్టు హరికృష్ణకే
అమరావతి:చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానం నుండి 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి గుమ్మడి కుతుహలమ్మ తనయుడు హరికృష్ణకు టిడిపి టిక్కెట్టు దక్కే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కుతుహలమ్మ ఓటమి పాలయ్యరు. అయితే వచ్చే ఎన్నికల్లో కుతుహలమ్మ కొడుకు హరికృష్ణకు రంగంలోకి దింపితే సహకరిస్తామని ప్రత్యర్థి వర్గం కూడ సంకేతాలు ఇవ్వడంతో హరికృష్ణకే టిక్కెట్టు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది.
చిత్తూరు జిల్లాలో వైసీపీ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు టిడిపి నాయకత్వం ప్లాన్ చేస్తోంది. 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేైసుకోవాలని టిడిపి ప్లాన్ చేస్తోంది.
2014 ఎన్నికలకు ముందే కుతుహలమ్మ కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. ఎన్నికల సమయంలోనే పార్టీ మారడంతో పార్టీలోనే కొందరు ఆమెకు వ్యతిరేకంగా పనిచేశారనే ప్రచారం కూడ లేకపోలేదు.
సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కుతుహలమ్మ
చిత్తూరు జిల్లాకు చెందిన కుతుహలమ్మ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. 1981లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబునాయుడు కుతుహలమ్మ జిల్లా పరిషత్ ఛైర్మెన్ ను చేయడంలో కీలక పాత్ర పోషించారని అప్పట్లో ప్రచారం ఉండేది. 1985, 1989, 2004లలో వేపంజేరి నియోజకవర్గం నుండి విజయం సాధించారు.నియోజకవర్గాల పునర్విభజనతో వేపంజేరి నియోజకవర్గం స్థానంలో గంగాధర నెల్లూరు స్థానం ఏర్పాటైంది. దీంతో ఈ స్థానం నుండి కుతుహలమ్మ విజయం సాధించారు.2004, 2009లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. సోనియాగాంధీ చొరవతో కుతుహలమ్మకు 2009లో డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది.
కాంగ్రెస్ను వీడేందుకు కారణాలివే
2009లో నియోజకవర్గాల పునర్విభజన కారణంగా వేపంజేరి రద్దయింది. దాని స్థానంలో గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానం ఏర్పాటైంది. అయితే ఆ సమయంలో కుతుహలమ్మకు టిక్కెట్టు ఇవ్వలేదు. అయితే ఆమె సోనియాగాంధీ వద్దకు వెళ్ళి చివరి నిమిషంలో టిక్కెట్టు సంపాదించుకొన్నారు.చివరి నిమిషంలో టిక్కెట్టు దక్కినా ఆమె విజయం సాధించారు. వైఎస్ మరణించిన తర్వాత రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కుతుహలమ్మకు చోటు దక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యతను ఇవ్వడం లేదని కుతుహలమ్మ భావించారు. కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అయితే ప్రాధాన్యత ఉండదని భావించి 2014 ఎన్నికలకు ముందుగా టిడిపిలో చేరారు.
ఆ షరతుతోనే టిడిపిలోకి కుతుహలమ్మ
2014 ఎన్నికల సమయంలో గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానం నుండి కుతుహలమ్మను బరిలోకి దిగాలని చంద్రబాబు నాయుడు సూచించారు. అలా అయితేనే టిడిపిలోకి రావాలని బాబు కోరారని ఆ సమయంలో ప్రచారం సాగింది. దీంతో 2014 ఎన్నికల సమయంలో కుతుహలమ్మ అనివార్యంగా పోటీకి దిగిందని టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే టిడిపిలో ఓ వర్గం ఆమెకు సహకరించని కారణంగానే కుతుహలమ్మ ఓటమి పాలైందంటారు.
హరికృష్ణకే టిక్కెట్టు
ఓటమి పాలైనప్పటికీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబునాయుడు ఆమెకే అప్పగించారు.అయితే కుతుహలమ్మ కొడుకు హరికృష్ణకు పార్టీ నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రత్యర్థి వర్గం నుండి సంకేతాలు రావడంతో హరికృష్ణకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది టిడిపి. లోకేష్తో హరికృష్ణకు మంచి సంబంధాలున్నాయి. ఈ కారణంగానే 2019 ఎన్నికల్లో హరికృష్ణకే టిక్కెట్టు కట్టబెట్టే అవకాశాలున్నాయనే టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది.