గరం గరం ఇలాచీ టీ: రెగ్యులర్ చాయ్ కు బెస్ట్ ఆల్టర్నేటివ్
సాధారణంగా వేడి వేడి టీని ఇష్టపడని వారెవరూ బహుశా ఉండకపోవచ్చు. ఉదయం, సాయంత్రం వేళ.. టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. వేడి వేడి టీ కడుపులో పడ్డాకే మిగిలిన పనుల్లో నిమగ్నమవుతారు. సాధారణ టీకి బదులుగా అందులో యాలకులను వేస్తే దాని రుచి మారిపోతుంది. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రెగ్యులర్ గా తాగే చాయ్కు మంచి ప్రత్యామ్నాయం కూడా. రోజువారీ జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పును తీసుకొస్తుంది.
వంటకాల్లో యాలకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రాచీన కాలం నుండి వీటిని సువాసన కోసమే కాకుండా వివిధ రకాల ఆయుర్వేద మూలికా వైద్యంలో ఉపయోగిస్తున్నారు. దీన్ని టీ లో కూడా చేర్చుకోవడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాలకుల (ఇలాచీ) టీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలు దెబ్బతినకుండా నిరోధిస్తాయి.

దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చలికాలంలో వేధించే గొంతు నొప్పి, శ్వాసకోశ ఇబ్బందుల నుండి త్వరితగతిన ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్త ప్రసరణను క్రమబద్ధీకరించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. అధిక బరువుతో ఇబ్బంది పడేవారికి యాలకుల టీ ఓ మంచి ప్రత్యామ్నాయం. ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నప్పుడు శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా యాలకుల పొడి అడ్డుకుంటుంది. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
శ్వాసకోశ ఇబ్బందులతో సతమతమయ్యే వారికి యాలకుల టీ ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. యాలకుల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించి, శ్వాస ప్రక్రియను సులభతరం చేస్తాయి. జలుబు, దగ్గు, అస్తమా వంటి సమస్యలకు ఇది ఎంతో ఉపశమనం ఇస్తుంది. నోటి దుర్వాసనను దూరం చేసి, చిగుళ్ల వ్యాధులు రాకుండా అడ్డుకోవడం, నోటిలోని హానికర బ్యాక్టీరియాను అంతం చేయడంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మూలకాలు దంతాలపై పాచి పేరుకుపోకుండా కాపాడతాయి. యాలకలలో ఉండే సహజ సమ్మేళనాలు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల స్థాయిని సమర్థవంతంగా తగ్గించగలవు. జీర్ణవ్యవస్థను చురుగ్గా మార్చడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తొలగిపోతాయి. రోజూ ఉదయాన్నే లేదా సాయంత్రం సమయంలో ఈ వేడి చాయ్ తీసుకోవడం వల్ల హుషారుగా ఉండవచ్చు.
యాలకుల టీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పాలు, బ్లాక్ టీ పొడి, నల్ల మిరియాలు, యాలకుల పొడి, అల్లం ముక్కలు, దాల్చినచెక్క, లవంగాలు. ముందుగా ఒక గిన్నెలో తగినన్ని నీరు, పాలు పోసి బాగా మరిగించాలి. ఆ తర్వాత తాజా మసాలా దినుసులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి మరిగే పాలలో వేయాలి.
పాలు మరిగేటప్పుడు దాల్చినచెక్క, లవంగాలు, అల్లం ముక్కలు, యాలకుల పొడితో పాటు కొద్దిగా నల్ల మిరియాలను కూడా చేర్చాలి. నీరు బాగా మరిగిన తర్వాత అందులో బ్లాక్ టీ పొడిని వేయాలి. అనంతరం గిన్నెపై మూత పెట్టి, మంటను తగ్గించి సుమారు పది నిమిషాల పాటు చిన్న మంటపై మరగనివ్వాలి. చివరగా వడకట్టుకుని, రుచి కోసం చక్కెరకు బదులుగా బ్రౌన్ షుగర్ లేదా తేనె కలుపుకొంటే వేడి వేడి యాలకుల టీ సిద్ధమవుతుంది.















Click it and Unblock the Notifications