10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు: ప్రతి నెలా లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్
హైదరాబాద్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే 10 లక్షల ఉద్యోగాల భర్తీని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ప్రతి నెలా లక్ష ఉద్యోగాల భర్తీ కోసం మూడో వారంలో ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నామని వెల్లడించారు.
ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. జనవరి 20న మరికొందరికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తామని అన్నారు. ప్రజారోగ్యానికి కేంద్రం పెద్దపీట వేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశ వ్యాప్తంగా లక్షా50వేల వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వెల్నెస్ సెంటర్లలో అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
గతంలో దేశ వ్యాప్తంగా 387 మెడికల్ కాలేజీలు ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 606కు పెరిగిందని, 7 ఎయిమ్స్ ఆస్పత్రులుండగా, ఆ సంఖ్య 22కు పెరిగిందని చెప్పారు. 2024లో మరో 9 ఎయిమ్స్ ఆస్పత్రులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి తెలిపారు.
మరోవైపు, ప్రధాని మోడీ ఆదివారం వందే భారత్ రైలును వర్చువల్గా ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా పలువురికి ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు.
మరోవైపు, తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ విసిరిన సవాలును కిషన్ రెడ్డి స్వీకరించారు. కేసీఆర్ రాజీనామా పత్రాన్ని రాసుకుని కేటీఆర్ వస్తే.. చర్చించడానికి సిద్ధమని తేల్చి చెప్పారు.