ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష: 6 లక్షల మందికిపైగా హాజరు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పరీక్షకు 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కానిస్టేబుల్ నియామకం కోసం 6,61,198 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 91.34 శాతం మంది పరీక్ష రాశారు.
ఈ మేరకు వివరాలను పోలీసు నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు వెల్లడించారు. మొత్తం 1,601 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగిందన్నారు.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు వేలిముద్రలు, డిజిటల్ ఫొటోలను పోలీసు అధికారులు సేకరించారని.. దేహధారుఢ్య పరీక్షలు, తుది పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగానే అనుమతిస్తామని ఆయన తెలిపారు. కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష కీ పేపర్ ను వీలైనంత త్వరలో వెబ్సైట్లో పెడతామని పోలీసు నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.