తెలంగాణ గ్రూప్-4 దరఖాస్తు గడువు పొడిగింపు, ఇప్పటికే 8 లక్షలకుపైగా అప్లికేషన్స్
గ్రూప్-4 దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సోమవారం ప్రకటించింది.
హైదరాబాద్: గ్రూప్-4 దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సోమవారం ప్రకటించింది. ఇప్పటికే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. నేటితో గడువు ముగియనుండటంతో ఇప్పటి వరకు మొత్తం దరఖాస్తుల వివరాలను అధికారులు వెల్లడించారు. 9168 పోస్టులకు గానూ 8,47,277 మంది అప్లై చేస్తున్నట్లు తెలిపారు.
ఆదివారం ఒక్కరోజే 58,845 మంది దరఖాస్తు చేసుకోగా.. ఆఖరి రోజైన సోమవారంనాడు మరో 34,247 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే దరఖాస్తు గడువును ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ తాజాగా ప్రకటించింది.
ఈ ఉద్యోగాలకు భారీ స్పందన వస్తుండటంతో సర్వర్పై ఒత్తిడి అనూహ్యంగా పెరిగి దరఖాస్తు ఫారం పూర్తి చేశాక ఫీజు చెల్లింపులో అభ్యర్థులకు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే గడువును కాస్త పొడిగించినట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లోని 25 విభాగాల్లో 9168 ఉద్యోగాల భర్తీకి గత డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఈ నోటిఫికేషన్ ద్వారా 8,180 పోస్టులను భర్తీ చేయనుంది.