9168 పోస్టుల భర్తీకి తెలంగాణలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల: వివరాలు తెలుసుకోండి
హైదరాబాద్: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. 9168 పోస్టులు గ్రూప్ 4 ద్వారా భర్తీ చేయనున్నట్లు టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
గ్రూప్-4 విభాగంలో 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-4లో మరో 4 రకాల పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఇటీవలే సాధారణ పరిపాలన శాఖ సవరించింది.
గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్ అండ్ వార్డ్ ఆఫీసర్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. పూర్తి వివరాలను tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఇటీవల 9,168 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే.
కాగా, గ్రూప్-4లో ముఖ్యంగా మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862, పంచాయితీరాజ్శాఖలో భారీ స్థాయిలో 1,245 పోస్టులు, 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు ఉన్నాయి. గతంలో గ్రూప్-2లో 663 పోస్టులు గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.