ఈ వారంలోనే తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదలకు టీఎస్ఎల్పీఆర్బీ కసరత్తులు పూర్తి చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ వారంలోనే ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా, సుమారు 8.5 లక్షల మంది అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తం 554 ఎస్సై పోస్టులకు ఆగస్టు 7న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 2,47,217 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఆగస్టు 28న 16,321 పోస్టులకు జరిగిన కానిస్టేబుల్ పరీక్షకు 6,03,955 మంది పరీక్ష రాశారు. అయితే, నోటిఫికేషన్లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షల ఫలితాలు సెప్టెంబర్ నెలలోనే వెల్లడించాల్సి ఉంది. కానీ, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు కటాఫ్ మార్కులను తగ్గిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఫలితాల విడుదల ఆలస్యమైంది.
కటాఫ్ మార్కులను బీసీ అభ్యర్థులకు 50, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు 40కి తగ్గిస్తూ పోలీస్ నియామక బోర్డు అక్టోబర్ 2న ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక ఓసీ అభ్యర్థులకు మాత్రం యథాతథంగా కటాఫ్ మార్కులను 60గా నిర్ణయించారు. తగ్గించిన కటాఫ్ మార్కులకు అనుగుణంగా ఈ వారంలో ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాల ప్రకటన తర్వాత ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ, మేజర్మెంట్ పరీక్షలను నవంబర్ నెలలో నిర్వహించే అవకాశాలున్నాయి.