Diwali 2022: దీపావళి పండుగనాడు పూజ ఆ సమయానికే.. లక్ష్మీపూజతో కలిగే ఫలితమిదే!!
దీపావళి పండుగ.. జీవితాలలో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే పండుగ. అటువంటి దీపావళి పండుగను హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు. భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళికి ఒక విశేషమైన స్థానం ఉంది.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి
ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలోదీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, అంధకారాన్ని తొలగించి వెలుగులను తీసుకువచ్చే సంకేతంగా భావిస్తారు. దీపావళి నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీనిని దీవాలి అని , దీపావళి అని పిలుస్తారు. దీపావళి పండుగనాడు అందరూ ఇల్లంతా దీపాలను వెలిగించి సంపదకు, అదృష్టానికి, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.
దీపావళికి ఇంట్లోకి సానుకూల శక్తి ఆహ్వానం
దీపావళి పండుగకు ముందు ఇల్లంతా శుభ్రం చేసి ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులను బయటకు పంపి, సానుకూల శక్తిని ఇంటిలోకి ఆహ్వానించి ఆపై ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆపై లక్ష్మీ దేవిని విశేషంగా పూజిస్తారు. దీపావళి పండుగ అంటేనే సరదా పండుగ. కుటుంబ సభ్యులందరూ కలిసి, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకునే పండుగ. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. బాణాసంచా ప్రకాశాలతో, దీపాల వెలుగులతోఅందరూ సుఖ సంతోషాలతో జీవించాలని జరుపుకునే పండుగ.
అక్టోబర్ 24వ తేదీన దీపావళి పండుగ..
అటువంటి దీపావళి పండుగ ఈ సంవత్సరం 24వ తేదీ సోమవారం నాడే జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాల నుండి అమావాస్య మొదలవుతుందని ఇక మంగళవారం సాయంత్రం అమావాస్య ఘడియలు పూర్తవుతున్నాయి అని చెబుతున్నారు. అయితే ఈసారి దీపావళి పండుగ మొదటి 25వ తేదీగా భావించిన క్రమంలో ఆ రోజు సూర్య గ్రహణం రావడంతో గ్రహణం నాడు పండుగ జరుపుకోకూడదని, అందుకే 24 వ తేదీ సోమవారం పండుగ జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఇక సోమవారం నాడు సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకోవడానికి అనువైనదిగా చెబుతున్నారు.
ప్రదోష కాలంలోనే దీపావళి పూజ .. లక్ష్మీ పూజతో ఐశ్వర్యం
అక్టోబర్ 24వ తేదీ సాయంత్రం లక్ష్మీపూజ మరియు గణేశ పూజనిర్వహించుకోవాలనిపండితులు చెబుతున్నారు. దృక్ పంచాంగ్ ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత దీపావళి పూజప్రదోష కాలంలోనే నిర్వహిస్తారు.ఆ సమయంలో పూజ చేస్తేనే శుభాలు కలుగుతాయని పంచాంగం చెబుతోంది. హిందూ గ్రంధాల ప్రకారం, లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు మరియు సంతానోత్పత్తికి ప్రతీకగా భావిస్తారు.దీపావళి నాడే లక్ష్మీదేవి భూమి మీదకు వచ్చిందని చెప్తారు. లక్ష్మి సంపదను ఇచ్చే దేవత కావటంతో లక్ష్మీదేవి పూజతో పాటు, గణేషుడిని కూడా శాస్త్రోక్తంగా పూజిస్తారు భక్తులు. దీపావళి నాడు లక్ష్మీ దేవిని పూజించి ఆమెను సంతుష్టురాలిని చేస్తే సిరి సంపదలు కలుగుతాయి. సంతోషం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది.