కాశీ పుణ్య క్షేత్ర ప్రాముఖ్యత.. చూడవలసినవి ప్రదేశ విశేషాలు
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
కాశీ లేదా వారాణసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు ఉప నదులు కాశీనగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు ఏర్పడింది. బ్రిటిషువారి పాలన సమయంలో వారణాసి, బెనారస్ అయింది.
కాశ్యాన్తు మరణాన్ ముక్తి : - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలో ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది.
ఇక్కడ గంగానది, హిందూమతము, హిందూస్తానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ మరియు సంస్కృత పండితుల పీఠం - ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షీ ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహరాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, సాంస్కృతిక ప్రముఖులు వారాణసి నగరంలో లేదా దాని పరిసర ప్రాంతాలతో అనుబంధం కలిగి ఉన్నారు.

కాశీలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు :-
1. కాశీ విశ్వనాధుని దేవాలం 2. అన్నపూర్ణాలయం 3. విశాలాక్షి ఆలయం 4. కాల భైరవాలయం 5. మృత్యుంజయేశ్వరాలయం
6. సారనాద్ మందిరం 7. వ్యాస కాశి 8. దండపాణి మందిరం 9. చింతామణి గణపతి మందిరం 10. బిర్లా టెంపుల్ 11. సంకట విమోచన హానుమాన్ మందిరం 12. శ్రీ త్రిదేవి మందిరం 13. దుర్గా మందిరం 14. తులసి మానస మందిరం 15. గవ్వలమ్మ మందిరం 16. కేదారేశ్వర మందిరం 17. తిలబండేశ్వరాలయం 18. జంగన్ వాడి మఠ్ 19.గంగా హారతి 20. బిందు మాధవుడు 21. వారాహిదేవి 22. దత్తమందిరం ( దత్తపీఠము ) ఇలా కాశీలో ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు.చిన్న ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ దాదాపు 23 వేలకుపైగా దేవాలయాలున్నాయి.

పురాణకథనాలు
చరిత్ర:- సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పురాణ కధల ద్వారా తెలుస్తుంది. హిందువుల ఏడు పవిత్ర నగరాలలో కాశీ ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది. 18వ శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో అతని రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది.
పురాణకథనాలు:- కాశీ శివ స్థాపితమని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తి పురాలలో ఒకటైన కాశీ పట్టణానికి వెళ్ళారు. అయోధ్య, మథుర, గయ,కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి నగారాలు. ప్రపంచంలో నిరంతరంగా నివాస యోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉంది. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. అధర్వణవేదకాల ప్రజలిక్కడ నివసించారు. 8వ శతాబ్దంలో 23వ జైన గురువు మరియు ఆరంభకాల తీర్ధ గురువు అయిన పర్ష్వ జన్మస్థానం.

వ్యాపార వాణిజ్యము:-
వ్యాపార వాణిజ్యము:- వారణాశి పారిశ్రమికంగా కూడా అభివృద్ధి చెందింది. వారణాశి పట్టు వస్త్రాలకు, సెంటు, దంతపు వస్తువులు మరియు శిల్పాలకు ప్రసిద్ధి.
ప్రముఖులు :- గౌతమ బుద్ధుడు ( జననం 567 క్రీ.పూ ) నివసించిన కాలంలో కాశీ రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. క్రీ.పూ 528 బుద్ధిజం కాశీలో స్థాపించబడిందని అంచనా. 8వ శతాబ్దంలో ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు. శంకరాచార్యుడు శివారధన విధానాలను సాధికారంగా ఆరంభించిన తరువాత వారణాశి మతపరంగా మరింత ప్రసిద్ధి చెందింది.

ముస్లిం పాలన కాలంలో కాశీ :-
ముస్లిం పాలన కాలంలో కాశీ :- మౌర్యుల కాలంలో తక్షశిల మరియు పాటలీపుత్ర మద్య ఉన్న రహదారితో కాశీ పట్టణం అనుసంధానించబడి ఉంది. 1194లో వారణాశి నగరం కుతుబుద్దీన్ ఐబక్ స్వాధీనమైంది. కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశంతో నగరంలోని సుమారు 1000 ఆలయాలను ధ్వసం చేయబడ్డాయి. ముస్లిం ఆక్రమణలో నగరం దాదాపు 3 శతాబ్ధాల కాలం క్షీణావస్థను చవిచూసింది. ఆఫ్గన్ దండయాత్ర తరువాత నగరంలో సరికొత్తగా ఆలయాలు నిర్మించబడ్డాయి.ఫెరోజ్ షాహ్ కాలంలో 1376లో వారణాశిలోని మరికొన్ని ఆలయాలు ద్వంసం చేయబడ్డాయి.
ఆఫ్గన్ రాజు సికిందర్ లోడి హిందువుల ఆణిచివేతను కొనసాగిస్తూ 1496లో మిగిలిన హిందూ ఆలయాలను ద్వంసం చేయించాడు. ముస్లిం పాలన కాలంలోనే వారణాసిలో మేధావులకు మరియు తాత్వికులకు కేంద్రంగా మారింది. మద్యకాలంలో వారణాసి మత సంప్రదాయాలకు మరియు విద్యకు కేంద్రమై విలసిల్లింది. భక్తి ఉద్యమకాలంలో వారణాశిలో 1389లో రామభక్తుడైన కబీరుదాసు జన్మించాడు. కబీరుదాసు రచించిన భక్తిరసపూరిత కీర్తనలు 15 వ శతాబ్దంలో భారతదేశంలో కీర్తించబడ్డాయి.
15 వ శతాబ్దంలో సంఘసంస్కర్త యోగి, కవి, యాత్రికుడు మరియు మతగురువు అయిన రవిదాసు వారణాశిలో జన్మించాడు. రవిదాసు జీవనోధి కొరకు తోళ్ళ పరిశ్రమలో పనిచేసాడు. అలాగే భారతదేశం మరియు దక్షిణాసియా అంతటి నుండి అనేక ప్రఖ్యాత విద్యావేత్తలు, బోధకులు వారణాశిని సందర్శించారు. 1507లో గురునానక్ దేవ్ శివరాత్రి సందర్భంగా వారణాశిని సందర్శించాడు. ఈ సంఘటన సిక్కుమత స్థాపనలో అత్యంత ప్రాముఖ్యత వహించింది.












Click it and Unblock the Notifications