Revanth Reddy: మా నెక్ట్స్ సువేందు రేవంత్ రెడ్డే ? బీజేపీ ఎంపీ షాకింగ్ జోస్యం..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీనికి తగినట్లుగానే రేవంత్ రెడ్డి.. బీజేపీ విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి కేసు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత వచ్చే వరకూ చర్యలు తీసుకోలేదు. దీంతో పాటు ప్రధాని మోడీ పాల్గొన్న సభలో రేవంత్ వ్యాఖ్యలు కూడా బీజేపీకి ఆయన దగ్గరవుతున్నారా అన్న ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఒకరు రేవంత్ త్వరలో తమ పార్టీలోకి రాబోతున్నట్లు తేల్చేశారు.
రేవంత్ రెడ్డి కూడా పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి (Suvendu Adhikari) తరహాలోనే బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Aravind) జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు 'సువేందు అధికారి' తరహాలో మారవచ్చని ఆయన తెలిపారు. ఆరేళ్ల క్రితం బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరినట్లే, రేవంత్ రెడ్డి కూడా రాజకీయ పక్షాలు మారవచ్చని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

దశాబ్దాలుగా కాంగ్రెస్లో గడిపిన సీనియర్ పార్టీ నాయకులను విస్మరించి, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం ద్వారా కాంగ్రెస్ నాయకత్వం పొరపాటు చేసిందని అరవింద్ వ్యాఖ్యానించారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూస్తుందని పేర్కొన్నారు.2028-29లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడబోతోందని అరవింద్ తెలిపారు. తాజాగా ప్రధాని మోడీ కూడా రేవంత్ రెడ్డికి పరోక్షంగా బీజేపీలో చేరాలని ఆఫర్ ఇచ్చారు. మీరు చేరాలనుకున్న చోటికి చేరలేకపోవచ్చు, కానీ చేరగలరు... నాతో చేరడం మంచిది అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలతో అనుమానాలు పెరిగాయి.














Click it and Unblock the Notifications