సికింద్రాబాద్ నుంచి అరుణాచలం, చిదంబరం స్పెషల్- ఏపీలో హాల్ట్ స్టేషన్లు
Secunderabad- Divya Dakshin Jyotirlinga special train: ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దివ్య దక్షిణ జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీ ఇది. తమిళనాడులో గల ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను ఇందులో చేర్చింది ఐఆర్సీటీసీ. అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి వంటి పుణ్య క్షేత్రాలు ఇందులో ఉన్నాయి.
ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. మొత్తం ఏడు రాత్రులు/ ఎనిమిది పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. ఈ నెల 25వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్లీపర్- 237, 3ఏసీ- 416, 2ఏసీ- 52.

సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్ప్రెస్కు జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలల్లో హాల్ట్ సౌకర్యం ఉంటుంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.
తొలుత ఈ ఎక్స్ ప్రెస్ తిరవణ్ణామలైకి చేరుకుంటుంది. అక్కడి అరుణాచలం ఆలయ దర్శనంతో ఈ యాత్ర మొదలవుతుంది. అరుణాచలేశ్వరుడిని దర్శనానంతరం ఈ ఎక్స్ ప్రెస్ రామేశ్వరానికి చేరుకుంటుంది. అక్కడ వెలిసిన రామనాథస్వామివారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ప్రత్యేక పూజలు చేయవచ్చు. అనంతరం మధురైకి వెళ్తుంది. ప్రఖ్యాత మీనాక్షి అమ్మవారిని యాత్రీకులు దర్శించుకోవచ్చు. ఆ తర్వాతి గమ్యస్థానం- కన్యాకుమారి. ఇక్కడ రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ ఆలయ దర్శనం ఉంటుంది.
అక్కడి నుంచి నేరుగా తిరుచ్చి బయలుదేరి వెళ్తుంది ఈ ఎక్స్ ప్రెస్. అక్కడ రంగనాథస్వామివారిని దర్శించుకోవచ్చు. అక్కడి నుంచి తంజావూరు వెళ్తుంది. తంజావూరులో చరిత్ర ప్రసిద్ధిగాంచిన బృహదీశ్వరాలయాన్ని యాత్రీకులు దర్శిస్తారు. అనంతరం చిదంబరం నటరాజ స్వామివారి ఆలయానికి వెళ్తారు. చిదంబరం దర్శనంతో ఈ యాత్ర ముగుస్తుంది. అక్కడి నుంచి తిరిగి సికింద్రాబాద్ కు చేరుకుంటుందీ రైలు.
ఈ టూర్ ప్యాకేజీ ద్వారా దివ్య దక్షిణ జ్యోతిర్లాంగాలను దర్శించుకోదలిచిన వాళ్లు ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 14,700 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 13,500 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ)లో పెద్దలకు 21,700, పిల్లలకు 20,600 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దలకు 27,900, పిల్లలకు 26,600 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications