ఎల్లుండే శక్తిమంతమైన లలిత జయంతి- డోన్ట్ మిస్..
సకల శుభాలు ప్రసాదించే షోడశి జయంతిని ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నాడు రానుంది. ఉదయ తిథి ప్రకారం ఆ రోజే దీన్ని జరుపుకొంటారు. లలితా జయంతి అని కూడా పిలుస్తారీ పర్వదినాన్ని. మాఘ పౌర్ణమి వేళ శ్రీ దేవి షోడశి పుట్టినరోజును జరుపుకొంటారు. ఈ రోజున భక్తులు శ్రీ యంత్ర పూజలు, శ్రీ విద్యా సాధనలు చేసి ఆధ్యాత్మిక ఎదుగుదల, అంతర్గత సామరస్యం, లలిత అమ్మవారి దివ్య ఆశీర్వదాలు కోరతారు.
హిందూ పంచాంగం ప్రకారం, మాఘ పౌర్ణమి తిథి ఫిబ్రవరి 1వ తేదీ తెల్లవారుజామున 5:52 నిమిషాలకు ప్రారంభమై 2వ తేదీ వేకువజామున 3:38 గంటలకు ముగుస్తుంది. 10 మహావిద్యలలో మూడవ మహావిద్యగా, షోడశి దేవిని శ్రీకుల సంప్రదాయంలో పూజిస్తారు. ఆమెను మహా త్రిపుర సుందరి, లలిత, రాజరాజేశ్వరి, బాలపంచదశి వంటి అనేక పేర్లతోనూ కొలుస్తారు.

మహా త్రిపురసుందరి అమ్మవారిని శ్రీయంత్రం రూపంలో పూజిస్తారు. షోడశి సాధన ఐహిక సుఖాలు (భుక్తి), మోక్షం (ముక్తి) రెండింటినీ ప్రసాదిస్తుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం అమ్మవారు 16 దివ్య కళలను పరిపాలించే పరాశక్తి. షోడశి దేవి ఆరాధన భౌతిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. షోడశి జయంతి ప్రాముఖ్యత అనేక తాంత్రిక, ఆధ్యాత్మిక గ్రంథాలలో పొందుపర్చారు.
షోడశి దేవి పంచవక్త్ర. అంటే అయిదు ముఖాలతో వర్ణిస్తారు. వీటిలో శివుడి అయిదు రూపాలైన తత్పురుష, సద్యోజాత, వామదేవ, అఘోర, ఈశానలను సూచిస్తాయి. అవి విశ్వ సమతుల్యత, చైతన్యానికి ప్రతీకలు. అమ్మవారు సూక్ష్మ, స్థూల, పరా, తురియ అనే నాలుగు రూపాలలో పూజలందుకుంటుంది. భక్తులను భౌతిక స్పృహ నుండి ఆధ్యాత్మిక జాగృతికి నడిపిస్తుంది. షోడశి దేవిని పూజించడం వల్ల కుటుంబంలో సామరస్యం, ఇంద్రియ నిగ్రహం, బలం, ఆధ్యాత్మిక స్పష్టత లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
షోడశి జయంతి నాడు భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి, శుచిగా స్నానం చేసి, శ్రీ యంత్ర పూజ చేస్తారు. లలితా సహస్రనామం పఠించడం, శ్రీ విద్యా ధ్యానం చేయడం, పూలు, ధూపం, దీపాలతో దేవికి నైవేద్యాలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ఉపవాసం ఉండి, మంత్ర జపం చేస్తూ దైవిక ఆశీర్వదాలు పొందుతారు. షోడశి దేవికి శరణాగతి చెందిన భక్తులు.. సాధకుడు- దైవం మధ్య భేదం లేని స్థితిని పొందుతారని భావిస్తారు. ఆమె షోడశ్వర రుద్రుని సజీవ శక్తిగా పరిగణిస్తారు.












Click it and Unblock the Notifications