నృసింహ స్వామి జయంతి: చరిత్ర ఏంటి.. ఎలాంటి పూజలు చేయాలి..?
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం
నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ రోజు సాయంకాలం నరసింహ మూర్తి హిరణ్య కశిపుని వధించడానికి అతని ఆస్థాన మండప స్తంభము నుండి ఉద్భవించెను. అని నరసింహుడు ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణములో ఉంది.

"వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్,
మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్"
అని నరసింహుడు ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణములో ఉంది.
శ్రీవైష్ణవులు సంప్రదాయానుసారంగఅ త్రయోదశి (ముందు రోజు) నాటి రాత్రి ఉపవాసం ఉండి, చతుర్దశి నాడు కూడా ఉపవాసం ఉండి, ప్రదోష కాలమున నృసింహ విగ్రహమును పూజించుతారు. స్తంభములో జన్మించాడు గనుక భవంతి స్తంభములకు తిరుమణి, తిరు చూర్ణములు పెట్టి పూజిస్తారు. రాత్రి జాగరణము చేసి, స్వర్ణసింహ విగ్రహమును దానమిచ్చి, మరునాడు పారణ చేయుదురు. వైశాఖము గ్రీష్మము గనుక వడపప్పు, పానకము ఆరగింపు పెడతారు.
నృసింహ పురాణ కథ
ఇది ప్రహ్లాదుని పూర్వ జన్మపు వాసుదేవుని వృత్తాంతమునకు సంబంధించిన కథ.
అవంతీ నగరమున సుశర్మ అను వేద వేదంగ పారాయణుడైన బ్రాహ్మణుడు ఉండెను. అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు. వారికి ఐదుగురు కుమారులు కలిగిరి. వారిలో కనిష్ఠుడు వాసుదేవుడు వేశ్యాలోలుడై, చేయరాని పనులు చేయువాడు. ఇట్లుండగా ఒకనాడు వాసుదేవునకు, వేశ్యకు కలహము సంభవించెను. దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భుజింపలేదు. ఆనాడు నృసింహ జయంతి. వేశ్య లేనందు వలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేసెను. వేశ్య కూడా ఉపవాసము, జాగరణ చేసినది. అజ్ఞాతముగా ఇట్లు వ్రత మాచరించుట వలన వీరు ఇద్దరూ ముక్తులై ఉత్తమగతులు పొందారు.
ఆదిశంకరుల విషయంలో నృసింహుడి వృత్తాంతం:- మండన మిశ్రునితో శాస్త్రచర్చ నేపథ్యంలో ఒక రాజు శరీరంలోకి ఆదిశంకరులు ప్రవేశిస్తారు. ఈ సంగతి తెలుసుకున్న ఆయన శరీరాన్ని తగులబెట్టాలని ఆ రాజ్యపు మంత్రి ప్రయత్నిస్తాడు. అప్పుడు శ్రీనృసింహ స్వామిని శంకరులు ప్రార్థిస్తారు. ఆయన దేహం దగ్ధం కాకుండా నారసింహుడు రక్షిస్తాడు. ఆ సందర్భంలో శంకరులు చేసిన ప్రార్థనే 'శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం'.
అన్నమయ్య విషయంలో ఇతివృత్తం :- అన్నమయ్యను కూడా ఆపద నుంచి కాపాడిన కరుణామయుడు నారసింహుడే! భక్తితో కొలిచినవారికి స్వామివారు కొంగు బంగారం. ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా ఆదుకొని దుష్ట శిక్షణ చేశాడు. ఆర్తరక్షణ పరాయణుడైన నరసింహ స్వామి భక్తులను మృత్యువు నుంచి కాపాడతాడు.

శ్రీ నరసింహ మహా మృత్యుంజయ మంత్రం:-
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖమ్
నృసింహం భీషణం భద్రం
మృత్యోర్ మృత్యుర్ నమామ్యహం
ఈ మంత్రాన్ని నిత్యం 108 సార్లు జపించినట్టయితే అనారోగ్య బాధలూ, అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘాయుష్షు లభిస్తుందనీ శాస్త్రవచనం. కరోనాతో కల్లోలం అవుతున్నవేళ పెద్దలే కాదు, పిల్లల చేత కూడాఈ మంత్రాన్ని వల్లె వేయిస్తే... అనవసరమైన భయాలు దూరమై, స్థిరమైన బుద్ధి, ఆయురారోగ్యాలూ కలుగుతాయి. జై నారసింహా జై లక్ష్మీనారసింహ జై..












Click it and Unblock the Notifications