vastu tips: దీపావళి లక్ష్మీపూజకు ముహూర్తం ఇదే.. సూర్యగ్రహణంతో ఈ రాశుల వారు జాగ్రత్త!!
హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ దీపావళి పండుగ. ఇక దీపావళి పండుగకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అనేక విషయాలను పండుగ గురించి తెలుసుకుంటున్నాం. దీపావళి పండుగ సందర్భంగా ఇంటిని అందంగా అలంకరించుకోవడం, దీపాలు వెలిగించడం, కొత్త బట్టలు ధరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడపడం, సంపదకు, శ్రేయస్సుకు, ఆరోగ్యానికి, ఆనందానికి మూలకారణమైన లక్ష్మీదేవికి విశేషంగా పూజలు చేయడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ. ఇక ఈ సంవత్సరం కూడా దీపావళి జరుపుకోవడానికి అందరూ రెడీ అవుతున్నారు.

దీపావళి పండుగ చేసుకోవాల్సింది ఆ రోజే
అయితే ఈ సంవత్సరం దీపావళి పండుగను 25వ తేదీన కాకుండా 24వ తేదీన జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇక అందుకు కారణం లేకపోలేదు. అక్టోబరు 25వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు సూర్య గ్రహణం వస్తుందని, అందుకే దీపావళి పండుగను గ్రహణం కారణంగా 24 వ తేదీన నిర్వహించుకోవాలని చెబుతున్నారు.

దీపావళి లక్ష్మీ పూజకు ముహూర్తం ఇదే
చాలామంది అక్టోబర్ 24వ తేదీన పండుగ జరుపుకోవాలా? లేక అక్టోబర్ 25వ తేదీన పండుగ జరుపుకోవాలా? అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఇక అటువంటి వారందరికీ దీపావళి పండుగను, లక్ష్మి పూజను అక్టోబర్ 24వ తేదీన జరుపుకోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు. దీపావళి పండుగ నాడు లక్ష్మీ పూజ చేసుకోవడానికి సమయాన్ని ముహూర్తాన్ని కూడా పండితులు సూచిస్తున్నారు. దీపావళి పండుగ ఈ సంవత్సరం అక్టోబర్ 24 సోమవారం నాడు వస్తుంది. సాయంత్రం 5.39 గంటలకు లక్ష్మీపూజ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.51 గంటలకు లక్ష్మీపూజ ముగుస్తుంది.

అక్టోబర్ 25న అమావాస్య, సూర్య గ్రహణం .. జాగ్రత్త అవసరం
ఇక ఈ సారి అక్టోబర్ 25వ తేదీన అమావాస్య, సూర్యగ్రహణం రెండు ఒకటేసారి వస్తున్న క్రమంలో గ్రహణ నియమాలను కూడా పాటించాలని సూచిస్తున్నారు. గ్రహణం సమయంలో ఎవరు భోజనం చేయకూడదని, గ్రహణం ప్రారంభమయ్యే లోపుగా పూర్తి అయ్యేలా భోజనం ప్లాన్ చూసుకోవాలని చెబుతున్నారు.
నిత్యావసర వస్తువులపై దర్భలు ఉంచాలని సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో ధ్యానం, జపం వంటివి చేయాలనుకునేవారు ప్రారంభ సమయంలో పట్టు స్నానం, గ్రహణం విడిచిన సమయంలో విడుపు స్నానం చేయాలని చెబుతున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత గృహ శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ రాశుల వారు జాగ్రత్త.. గ్రహణం తర్వాత పరిహారం చేసుకుంటే మంచిది
ఇక స్వాతి నక్షత్రం ఉన్న వారు, తులారాశి వారు గ్రహణాన్ని చూడకూడదని చెబుతున్నారు. గ్రహణం వల్ల కలిగే దోషాలను నివారించుకోవడం కోసం మరుసటిరోజు శివాలయ దర్శనం చేసుకోవాలని, అభిషేకం చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా తులా రాశి, కర్కాటక రాశి, మీన రాశి, వృశ్చిక రాశి వారు సూర్య గ్రహణం తర్వాత పరిహారాలు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications