70 ఏళ్ల వయస్సు వస్తున్నా.., మనిషిగా పుడితే..: బాబును ఏకేసిన కొడాలి నాని
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 70 ఏళ్ల వయస్సు వస్తున్నా సిగ్గు, శరం లేవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. బుధవారం ఆయన కర్నూలు జలదీక్షలో ప్రసంగిస్తూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మనిషిగా పుడితే పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని ఆయనయ సవాల్ విసిరారు.
దమ్ము, ధైర్యముంటే ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటిముందు ధర్నా చేయడానికి ముందుకు రావాలని, తాము కూడా వస్తామని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ జలదీక్ష ఎందుకు చేస్తున్నారో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. కానీ సీఎం చంద్రబాబు, మంత్రులకు మాత్రం తెలియడంలేదని అన్నారు. రోజుకు తెలంగాణ ప్రభుత్వం 20 - 30 వేల క్యూసెక్కుల నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నా కళ్లుండి చంద్రబాబు ప్రశ్నించలేకపోతున్నారని అన్నారు.
చంద్రబాబువి గాలి తిరుగుళ్లు...
ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ప్రధాని మోడీని ధైర్యంగా అడగలేక గాలి తిరుగుళ్లు తిరుగుతూ.. మోడీ దగ్గర చిప్ప పట్టుకుని అడుక్కుంటున్నారని విమర్శించారు. తెలంగాణ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం వైఎస్ జగన్ పోరాట యోధుడిలా దీక్ష చేస్తున్నారని కితాబిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సిగ్గు లేకుండా అభివృద్ధి పేరుతో టీడీపీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితేనే వాళ్ల నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు. అలా అయితే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా అని కొడాలి నాని అన్నారు. దమ్ముంటే సోనియాగాంధీని వైఎస్ జగన్ ఎదిరించి పోరాడినట్లు, చంద్రబాబు మోడీని ఎదిరించి పోరాడాలని సూచించారు.
పనామా పేపర్ల సెటిల్మెంట్ల కోసమే...
చంద్రబాబు వారం రోజుల విదేశీ యాత్రల పేరుతో పనామా పేపర్ల అంశాన్ని సెటిల్ చేసుకున్నట్లు ఆరోపించారు. ఇప్పటికే ఆయన బినామీ ప్రసాద్ పేరు పనామా పేపర్లలో ఉందని నాని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా వచ్చిందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమేనన్నారు. కృష్ణా జిల్లాలో కాలువల నిర్మాణం కోసం వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని, టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి అడ్డుపడే ప్రయత్నం చేసినా ఆయన దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు.
గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం తానే చేసినట్లు చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని అన్నారు. ప్రకాశం, పులిచింతల, నాగార్జున సాగర్లకు నీరు ఎలా అందిస్తారో అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్ జగన్ దీక్షను మంత్రులు విమర్శలు చేయడంపై నాని తీవ్రంగా తప్పుపట్టారు. డ్రామా దీక్షలంటే చంద్రబాబు హాయాంలో 70 మంది ఎమ్మెల్యేలతో కర్ణాటక ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి అక్కడ నుంచి ముంబై వెళ్లి తిరిగిరావడమని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications