బెడిసిన సొత్తు: బిజెపి ఒంటరి పోరు
హైదరాబాద్ : అధికార తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీల మధ్య జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల సీట్ల సర్ధుబాటులో తలెత్తినవివాదం ముదిరి పాకాన పడింది.తాము కోరినట్టు 165 జడ్పిటిసిలను కేటాయించకుంటే తాము ఒంటరిగానే పోటీచేస్తామని బిజెపి స్పష్టం చేసింది. తమకు బలమున్న 165 స్ధానాలలో పోటీకి తయారుగా ఉండమని తమ జిల్లా, నియోజకవర్గ నాయకులను ఆదేశించినట్టు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ బుధవారం నాడు హైదరాబాద్లో స్పష్టం చేశారు.
వాస్తవ పరిస్ధితిని గుర్తించకుండా తమ బలాన్ని అతిగా అంచనా వేసుకుని బిజెపి నాయకులు అధికంగా సీట్లు అడుగుతున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తుండగా, తమకు బలంలేని చోట పోటీ చేసి తామెందుకు ఓడిపోవాలనుకుంటామని బిజెపి నాయకులు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. తమకున్న బలాన్ని అంచనా వేసుకునే రాష్ట్రం మొత్తంమీద 165 జడ్పిటిసి సీట్లను అడుగుతున్నామని బిజెపి నాయకులు స్పష్టం చేస్తున్నారు. బిజెపి నాయకులు వాస్తవపరిస్ధితిని అర్ధంచేసుకుని నడుచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకూడా బుధవారం నాడు హైదరాబాద్లో కోరారు. నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజుల గడువు మాత్రమే వుండటంతో పొత్తుపై ఏర్పడిన ప్రతిష్టంభన ఉత్కంఠభరితంగా తయారయింది.












Click it and Unblock the Notifications