నక్సలిజంపై ఆధునిక యుద్ధం
హైదరాబాద్ః రాష్ట్రంలో అభివృద్ధికి అటంకంగా నిలుస్తూ, పెచ్చుమీరుతున్న నక్సలిజాన్ని ఎదుర్కునేందుకు పోలీసులకు అత్యాధునిక శిక్షణ, ఆయుధాలను సమకూర్చనున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
హైదరాబాద్ యూసఫ్గూడలోని పోలీస్ లైన్స్లో రాష్ట్రస్పెషల్ పోలీసుల 44వ రైజింగ్ డే ఉత్సవాల సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులదే కీలక పాత్ర అని ఆయన చెప్పారు.
స్పెషల్ పోలీసులసేవలను, త్యాగాలను ఆయన ప్రశంసించారు. తుపాకుల ద్వారానే అధికారం వస్తుందనే గుడ్డి నమ్మకంతో తీవ్రవాదులు రాష్ట్రంలో హింసాకాండను సృష్టించడాన్ని ఆయన తీవ్రంగాఖండించారు. ఫ్యాక్టరీల పేల్చివేత వల్ల పేదల ఉపాధి దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. పేదల పొట్టకొట్టే పనులు చేయవద్దని తీవ్రవాదులను ఆయన కోరారు. కొద్దిమంది పెట్టుబడితో వేలాది మంది ఉపాధిపొందుతుంటారని పెట్టుబడులు లేకపోతే నిరుద్యోగం పెరుగుతుందని ఆయన అన్నారు.
తీవ్రవాదులు రాష్ట్రంలో తమ చర్యలతో భయభ్రాంతులను సృష్టిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. స్పెషల్ పోలీసులు పదవీ విరమణ చేసే లోగా సొంతఇంటిని సమకూర్చుకునేందుకు వీలుగా ప్రభుత్వం తగిన సహాయం అందజేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. పోలీస్లైన్స్లో ఆయన నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు పోలీసుల కవాతును తిలకించడంతోపాటు గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి, డిజిపి కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
