కోర్టు మాట వింటే మంచిదిః బాబు
హైదరాబాద్ః దేశంలో మతసామరస్య వాతావరణాన్ని దెబ్బతీస్తున్న అయోధ్య సమస్యను సుప్రీం కోర్టు నిర్ణయానికి వదిలిపెట్టడం ఉత్తమమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. సోమవారం నాడు ఎన్టిఆర్ భవన్లో జరిగిన తెలుగుదేశం కార్యకర్తల శిక్షణా శిబిరానికి ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు పక్షాలు కోర్టు తీర్పుకు తలవొగ్గడానికి సిద్ధపడితే సమస్య పరిష్కారానికి కష్టపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లైనప్పటికీ అనేక మౌలిక సమస్యలు ప్రజలను ఇప్పటికీ పట్టి పీడిస్తున్నాయని ఈ సమస్యల పరిష్కారానికి రాజకీయనాయకత్వం ప్రయత్నించాల్సి వున్నదని ఆయన అన్నారు. మతసంబంధమైన అయోధ్యవిషయంలో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని ఓపిగ్గా వ్యవహరించాలని ఆయన అన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలకు చెందిన కార్యకర్తలకు ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు.












Click it and Unblock the Notifications
