ప్రశాంతంగా ముగిసిన శిలాదాన్
అయోధ్యః యావత్ భారతావనిని కలవరపెట్టిన శిలాదాన్ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రశాంతంగా పూర్తయింది. వివాదాస్పద స్థలానికి సుమారు ఓ కిలోమీటరు దూరంలోని దిగంబర్ ఆఖరాలో శిలాదాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మొదట ఫైజాబాద్ డివిజినల్ కమిషనర్ గుప్తా శిలాదానాన్నిస్వీకరిస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆఖరు నిమిషంలో ప్రధాని కార్యాలయంలో అయోధ్య వ్యవహారంపై ఏర్పాటు చేసిన ప్రత్యేకసెల్ ఇన్ ఛార్జ్ శతృఘన్ సింగ్ ను ఢిల్లీ నుంచి హుటాహుటిన అయోధ్యపంపారు. పరమహంస చేతుల మీదుగా శతృఘన్ సింగ్ శిలాదానాన్నిస్వీకరించారు.
కరసేవా పురం నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరమహంస,అశోక సింఘాల్ వెయ్యిమంది సాధువులు వెంటరాగా శిలాదాన స్థలానికి ఊరేగింపుగా బయలుదేరారు. దిగంబర్ అఖరా చేరుకున్న వెంటనే దానానికి ఉద్దేశించిన శిలలను అలకరించి, వేద మంత్రోచ్ఛాటనల మధ్య కేంద్ర ప్రభుత్వం పంపిన శతృఘన్ సింగ్ కుఅందజేశారు. శిలాదానం పూర్తయిన తరువాత కరసేవకులంతా ఒకరి తరువాత ఒకరువివాదాస్పద స్థలంలో నిర్మించిన రామాలయంలోకి వెళ్ళి పూజలు నిర్వహించారు.
అనూహ్యమైన భద్రతా ఏర్పాట్లు చేసిన కారణంగా అయోధ్య వీధులన్నీ బోసిపోయి కనిపించాయి. కనీసం 150 మంది కరసేవకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చిన కరసేవకులు భద్రతా వలయాన్ని ఛేదించుకొని అయోధ్యలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.వీరి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎటువంటి ఉద్రిక్తతలు లేకుండా శిలాదాన్ కార్యక్రమం ముగిసిపోవడంతోసర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.












Click it and Unblock the Notifications
