కాంగ్రెస్ ధర్నాలు, ఆందోళనలు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బుధవారం ధర్నాలు, పికెటింగ్లు నిర్వహించింది. పనికి ఆహారం పథకంలో అవినీతికి, ప్రజలపై కరెంట్ ఛార్జీల భారానికి నిరసనగా ఈ ధర్నాలు నిర్వహించింది. ధర్నాల సందర్భంగా కొన్ని చోట్లస్వల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్లోని చార్మినార్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు పాల్గొన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నిరుపేదలకు ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన పనికి ఆహార పథకంలో అవినీతి చోటు చేసుకుందని, ఈ పథకం కింది బియ్యం కర్ణాటక, తమిళనాడు, తదితర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారని, దీంతో తెలుగుదేశం మంత్రులు, నాయకులు, కార్యకర్తలు జేబులు నింపుకుంటున్నారని సత్యనారాయణరావు ఆరోపించారు.
పనికి ఆహారం పథకం అవినీతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ప్రమేయం ఉన్నదని సిఎల్పి నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. మంత్రులు అవినీతికి పాల్పడినవిషయం రుజువులతో సహా వెల్లడైనప్పటికీ చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టి ఈ అవినీతిలో ముఖ్యమంత్రికి ప్రమేయం ఉన్నదనే అభిప్రాయం బలపడుతోందని ఆయన అన్నారు. మొత్తం 3,600 కోట్ల రూపాయల పథకంలో 600 కోట్ల రూపాయలవిలువ చేసే పనులు మాత్రమే జరిగాయని ఆయన అన్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ హైదరాబాద్లోని బషీర్బాగ్లో జరిగిన ప్రదర్శనలో పోలీసు కాల్పులు జరిగిన నలుగురు చనిపోయి రెండేళ్లయిన సందర్భంగా వామపక్షాలు కార్యక్రమాలు నిర్వహించాయి. మృతుల ఫొటోలతో హైదరాబాద్లో ఒక ఊరేగింపు నిర్వహించాయి. అనంతరం సదస్సు జరిగింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వామపక్షాలు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్యక్రమాలు నిర్వహించాయి.
జడ్పిటిసి సభ్యురాలు మృతి
కడపలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని వస్తున్న కాంగ్రెస్ జిల్లా పరిషత్ ప్రాదేశిక కమిటీ(జడ్పిటిసి) సభ్యురాలు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న జీపు ఒక స్కూటర్ను ఢీకొట్టి ఈ ప్రమాదం సంభవించింది. స్కూటరిస్టు కూడా ప్రమాదంలో మరణించాడు.












Click it and Unblock the Notifications
