గౌరవయాత్రతో బిజెపి ప్రచారభేరి
అహ్మదాబాద్ః ప్రతిపక్ష పార్టీల నిరసన భేరి మధ్య గుజరాత్ లో వివాదాస్పద గౌరవ యాత్రకు భారతీయ జనతాపార్టీ ఆదివారం శ్రీకారం చుట్టింది. గుజరాత్ ఎన్నికల ప్రచారపర్వానికి ఈ గౌరవయాత్రను బిజెపి నాందిగా భావిస్తున్నది. మతఘర్షణలతో అట్టుడికిన గుజరాత్ లో ఈ గౌరవయాత్ర మరింత కల్లోలానికి దారితీస్తుందనే భయంతో గతంలో ఈ గౌరవయాత్ర ఆలోచనకు ప్రధాని వాజ్ పేయి చెక్ చెప్పారు.అయితే పార్టీలోని అతివాదుల ఒత్తిళ్ళు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి పట్టుదల కారణంగా ఈ యాత్ర ప్రారంభమైంది.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మోడికి బద్ధశత్రువు శంకర్ సింగ్ వాఘెలా సొంత నియోజకవర్గంలోని బాగ్వెల్ నుంచి గౌరవయాత్రకుశ్రీకారం చుట్టడం మరో విశేషం. ఈ గౌరవయాత్ర కేవలం ఓట్లకోసమేనని, లోక్ జనశక్తి పట్టు వున్న ప్రాంతాల్లో గౌరవయాత్రను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తామని మాజీ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అన్నారు.