బెంగుళూర్: కావేరీ జలాలపై, ఇతర తక్షణ సమస్యలపై చర్చ చేపట్టకుండానే కర్ణాటక ఉభయ సభలు మంగళవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. కావేరీ జలాలపై చర్చకు శాసనసభ, శాసనమండలి అత్యవసర సమావేశాలను మంగళవారం నుంచి తలపెట్టారు.
సుప్రీంకోర్టులో ఉన్నందున కావేరీ జలాలపై చర్చించాల్సిన అవసరం లేదని సంయుక్త సలహా సంప్రతింపుల కమిటీ ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో ఉభయ సభలను వాయిదా వేశారు. కావేరీ జలాలపై, తీవ్ర కరవు పరిస్థితులపై, మాజీ మంత్రి నాగప్ప కిడ్నాప్పై, ఆల్మట్టి డ్యామ్ నిర్వాసితుల కష్టనష్టాలపై చర్చలకు ఉభయ సభలను వచ్చే నెల మొదటి వారంలో సమావేశ పరచాలని కమిటీ సమావేశం అభిప్రాయపడినట్లు శాసనసమండలి చైర్మన్ బి.ఎల్.శంకర్, శాసనసభ స్పీకర్ ఎం.వి. వెంకటప్ప చెప్పారు.