ఆర్టీసి బస్సుదగ్ధం-9మంది దహనం
కర్నూలుః మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి ఒక ఆర్టీసీ బస్సు దగ్ధమైన సంఘటనలో 9 మంది సజీవదహనం అయ్యారు. కనీసం 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి కడపజిల్లా రాయచోటికి వెళుతున్న హైటెక్ బస్సు ఈ దుర్ఘటనలో చిక్కుకుంది. కర్నూలుకు 30 కిలోమీటర్ల దూరంలో మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల సమీపంలో మంగళవారం అర్థరాత్రి 12.10 గంటలకు ఈ ఘోరం జరిగింది. ఇది విద్రోహ చర్య అని పోలీసులు అనుమానిస్తున్నారు.
బస్సులో 36 మంది వుండగా తొమ్మిది మంది మరణించారు. కడపకు చెందిన మెడికో నీరజతో పాటు ముగ్గురు గల్లంతయ్యారు. 21మంది గాయపడ్డారు. నా ముందుసీట్లో కూర్చున్న వ్యక్తి క్యాన్ లో వున్న పెట్రోల్ దొర్లించి,అగ్గిపుల్ల గీశాడని ఒక మహిళా ప్రయాణికురాలు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెలిపింది. ఆమె భర్త ఆమెను కిటికీలోనుంచి బయటకులాగాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలతో బతికి బయటపడింది. బస్సును దహనం చేసిన వ్యక్తి కూడా సజీవదహనం అయ్యాడని ఆమె చెబుతున్నది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications
