మాస్కో డ్రామాకు ముగింపు
మాస్కో: మాస్కో లోని థియేటర్లో తీవ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న 700 మందిని రష్యన్ సైన్యం విడిపించింది. శనివారం ఉదయం రష్యా సైనికులు థియేటర్ పై మెరుపు దాడి చేసి థియేటర్ డ్రామాకు ముగింపు పలికారు. చెచెన్యా తీవ్రవాదుల నాయకుడు బరయేవ్ తో పాటు 32 మంది తీవ్రవాదులను సైనికలు కాల్చిచంపారు.
మరికొంతమంది తీవ్రవాదులు పారిపోయినట్లు రష్యన్ వార్తాసంస్థ తెలిపింది. చర్చలు విఫలం కావడంతో తీవ్రవాదులు శనివారం ఉదయం బందీలను చంపడానికి సిద్దమయ్యారు. దాంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సైనిక చర్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
70 అంబులెన్స్ లను రెడీగా ఉంచిన సైన్యం గాయపడిన బందీలకు వెనువెంటనే చికిత్స జరపడం ప్రారంభించింది. చకచకా ముగిసిన ఈ మెరుపుదాడి- రష్యా సైన్యం బలాన్ని మరోసారి తెలియచేసింది. మూడు రోజుల థియేటర్ డ్రామా పెద్దగా ప్రాణనష్టం లేకుండా ముగియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.