Home
Posted on 10-11-03
హైదరాబాద్: తమ ప్రజాహిత బస్సు యాత్రకు తాత్కాలికంగా మాత్రమే బ్రేక్లు వేశామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) నేత డాక్డర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి వేర్వేరుగా విలేకరులతో చెప్పారు. ప్రజా హిత బస్సుయాత్రను తిరిగి ప్రారంభిస్తామని వారు సోమవారం చెప్పారు.
ఢిల్లీ నేతల నుంచి పిలుపు రావడంతో తాము ప్రజాహిత బస్సు యాత్రను ఆపాల్సి వచ్చిందని శ్రీనివాస్ చెప్పారు. ప్రజాహిత బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభించిందని ఆయన చెప్పారు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో బస్సు యాత్ర ముగిసిందని ఆయన చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అల్టిమేటమ్ వల్లనే బస్సు యాత్రను ఆపేసినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో బస్సు యాత్రను ఆపేసి శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి సోమవారం హైదరాబాద్ వచ్చారు. వారు మంగళవారం ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఆదివారంనాడే యాత్రను ఆపాలనుకున్నప్పటికీ నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి ఒత్తిడి రావడంతో ఈ ఇరువురు నాయకులు సోమవారం ఉదయం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బస్సు యాత్ర ఎనిమిది రోజుల పాటు మూడు జిల్లాల్లో సాగింది.