నన్నపనేని రాజకుమారి ఆమరణ నిరాహార దీక్ష
గుంటూరు: మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి శుక్రవారం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. గుంటూరు కలెక్టరేట్ ముందు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో ఆమె నిరాహార దీక్షకు కూర్చున్నారు.
జిల్లా తెలుగుదేశం నాయకులతో కలిసి గుంటూరు మార్కెట్ యార్డును సందర్శించి మిర్చి రైతులను రాజకుమారి పరామర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్ మిర్చికి 3000 రూపాయల ధర నిర్ణయించాలని ఆమె ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని డిమాండ్ చేశారు. ప్రమాణాలతో సంబంధం లేకుండా మిర్చి అంతటినీ కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలను పెంచాలని, కొనుగోలు చేసిన మిర్చికి రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు నిరాహార దీక్షను కొనసాగిస్తానని ఆమె చెప్పారు.