పెనుకొండ రక్తసిక్తం: ఎఎస్ఐ సహా ఏడుగురు మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభ ఉప ఎన్నిక తొలి ఘట్టమే రక్తసిక్తమైంది. పోలీసులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. పోలీసు కాల్పుల్లో ఆరుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరణించినట్లు సమాచారం. మూడు మృతదేహాలు ఆర్డీవో కార్యాలయం వద్ద పడి ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు పోలీసు కాల్పుల్లో మరణించగా, మిగతావారు తొక్కిసలాటలోనో, రాళ్ల దాడిలోనో మరణించారని చెబుతున్నారు. ఈ సంఘటనలో హిందూపురం అసిస్టెంట్ పబ్ ఇన్స్పెక్టర్ ( ఎఎస్ఐ) కుళ్లాయప్ప మరణించినట్లు సమాచారం.
నామినేషన్ వేయడానికి తెలుగుదేశం అభ్యర్థి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపు పెనుకొండలోని టిటిడి కళ్యాణ మండపం వరకు చేరుకోగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద యెత్తున పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. పోలీసులు మొదట లాఠీచార్జి చేసి ఆ తర్వాత గాలిలోకి కాల్పులు జరపసాగారు. ఈ కాల్పుల్లో ఆరుగురు టిడిపి కార్యకర్తలు మరణించినట్లు తెలుస్తోంది. టిడిపి కార్యకర్తల దాడిలో 15 మంది పోలీసులు గాయపడినట్లు సమాచారం. హెడ్ కానిస్టేబుల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమైన పోలీసు కాల్పులు మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు సాగుతూనే ఉన్నాయి. ఈ స్థితిలో కూడా నామినేషన్ వేయడానికి సునీత సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఉద్రిక్తత మధ్యనే సునీత నామినేషన్ దాఖలు చేశారు.
టిడిపి కార్యకర్తలు పోలీసు జీపును దగ్ధం చేశారు. దారిలో వెళ్తున్న పది లారీలను ఆపి నిప్పంటించారు. పెనుకొండ అంతా భయానక వాతావరణం నెలకొంది. అదనపు పోలీసు బలగాలు పెనుకొండకు చేరుకుంటున్నాయి.