చెంగల వెంకట్రావు రాజీనామా చేయరు: టిడిపి
హైదరాబాద్: సినీ నిర్మాత, పాయకరావు పేట శాసనసభ్యుడు చెంగల వెంకట్రావు తమ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోరని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్. వేణుగోపాలాచారి చెప్పారు. నర్సింహుడు సినిమా విడుదల వివాదంతో నైతికంగా, ఆర్థికంగా దెబ్బ తిన్నందున తాను శాసనసభ సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని చెంగల వెంకట్రావు చెప్పారు. తాను రాజీనామా చేస్తానని చెంగల వెంకట్రావు అని ఉండరని వేణుగోపాలాచారి విలేకరులతో అన్నారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చెంగల వెంకట్రావు పరామర్శించారు.
చెంగల వెంకట్రావు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాజీనామా చేసే పరిస్థితి వెంకట్రావుకు రాదని ఆయన అన్నారు. పార్టీ వెంకట్రావు సినిమా వివాదం గురించి పట్టించుకోలేదని, వెంకట్రావుకు ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రాజీనామా చేసే నిర్ణయాన్ని వెంకట్రావు తీసుకోకపోవచ్చునని ఆయన అన్నారు.
భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం వల్లనే ఇటువంటి దురదృష్ఠకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఆయన ఆదివారంనాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్రావును పరామర్శించారు. సినీ రంగంలో పరిస్థితులు సవ్యంగా లేవని, నిర్మాణ వ్యయాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. నిర్మాణ వ్యయాన్ని నియంత్రించే విషయంలో ఒక నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని ఆయన అన్నారు.
జూనియర్ ఎన్టీ ఆర్తో గానీ, నందమూరి కుటుంబంతో గానీ తనకు ఏ విధమైన విభేదాలు లేవని చెంగల వెంకట్రావు చెప్పారు. జూనియర్ ఎన్టీ ఆర్ తన రెమ్యునరేషన్ను కూడా త్యాగం చేశారని ఆయన చెప్పారు. కారులో వెళ్తుండగా శనివారం రాత్రి వివాదం చెలరేగిందని, హఠాత్తుగా చెంగల వెంకట్రావు కారు దిగి హుస్సేన్సాగర్లో దూకారని పోలీసులు చెప్పారు.