నటుడు, మంత్రి సునీల్ దత్ కన్నుమూత
ముంబాయి: కేంద్ర క్రీడల, యువజన సర్వీసుల మంత్రి, ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ దత్ బుధవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ముంబాయిలోని జుహులో గల తన స్వగృహంలో ఆయన నిద్రలోనే మరణించారు. ఆయనకు 75 ఏళ్లు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సునీల్ దత్ కుమారుడు. ఆయనకు నమ్రత, ప్రియా అనే ఇద్దరు కూతర్లు, మనుమలు, మనమరాళ్లు ఉన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఆయన భార్య. ఆమె పేర సునీల్ దత్ ఒక క్యాన్సర్ ఆస్పత్రిని స్థాపించారు.
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు హిందీ సినీ పరిశ్రమలో ఆయన తిరుగులేని నటుడిగా ప్రఖ్యాతి గడించారు. సునీల్ దత్ 106 చిత్రాల్లో నటించారు. ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మదర్ ఇండియా సినిమాలో పోషించిన యాంగ్రీ యంగ్మన్ పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆస్కార్ అవార్డు కోసం నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం కూడా ఇదే. మదర్ ఇండియా సినిమా పూర్తయిన తర్వాత ఆయన నర్గీస్ను వివాహమాడారు. నర్గీస్కు ఆయన ఈ సినిమాలో రెండో కుమారుడిగా నటించారు. ఆయన చివరి చిత్రం మున్నాబాయ్ ఎంబిబియస్. నిర్మాతగా ఆయన కొన్ని సినిమాలను కూడా నిర్మించారు.
లోక్సభకు వరసగా ఆయన ఐదు సార్లు ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఓటమి ఎరగని రాజకీయ జీవితం ఆయనది. కాంగ్రెస్లో చేరి ఆయన లోక్సభకు పోటీ చేస్తూ వస్తున్నారు. 1929లో జన్మించిన సునీల్ దత్కు 1968లో పద్మవిభూషణ్ అవార్డు లభించింది. 1955లో సినీ రంగ ప్రవేశం చేశారు. సునీల్ దత్ పడోసన్, ఆమ్రపాలి వంటి ఆఫ్బీట్ సినిమాల్లో కూడా నటించారు. గీతా మేరా నామ్లో విలన్ పాత్ర పోషించారు. యాదే వంటి ప్రయోగాత్మక చిత్రంలో ఆయన నటించారు. ముఝే జీనే దోలో సంస్కర్త పాత్ర పోషించారు. సునీల్ దత్ విద్యాభ్యాసం ముంబాయిలోని జై హిందూ కాలేజీలో సాగింది.
ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు నిర్వహించిన శాంతియాత్రను రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసి ఐ) ఒంటెత్తు పోకడలను ఆయన ఇటీవల తప్పు పట్టారు.