డ్వాక్రా మహిళలకు నేరుగా అకౌంట్లలోకి! కేంద్రం ‘IELA’ తో రూ.10 లక్షలు సొంతం!
ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల ( డ్వాక్రా) మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త రుణ పరంపరకు శ్రీకారం చుట్టింది. మహిళలు సొంతంగా ఎంఎస్ఎంఈ (MSME) యూనిట్లను ఏర్పాటు చేసుకుని, రాణించేలా గరిష్ఠంగా రూ. 10 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందించనున్నట్లు రాష్ట్ర సెర్ప్ (SERP) శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతిష్ఠాత్మక 'దీన్దయాల్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం' (DAY-NRLM) కింద ఈ భారీ ఆర్థిక సాయాన్ని సమకూర్చనున్నారు. ఈ రుణాలకు ఎలాంటి పూచీకత్తు (గ్యారెంటీ) ఇవ్వాల్సిన అవసరం లేకపోవడం డ్వాక్రా మహిళలకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
ఈ పథకం కింద రుణాలు పొందడానికి కేంద్ర ప్రభుత్వం 'ఐఈఎల్ఏ' (IELA - Individual Enterprise Loan Application) అనే సరికొత్త, సులువైన దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మహిళలు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని ఆయన సూచించారు. ఇప్పటికే విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళలతో పాటు, సరికొత్తగా సొంతంగా బిజినెస్ యూనిట్లు ప్రారంభించాలనుకునే వారు కూడా ఈ లోన్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశారు.

ఈ వ్యాపారాలకు ప్రత్యేక ప్రోత్సాహం
మహిళా సాధికారతను పెంచే దిశగా ఈ పథకం ద్వారా పలు రకాల కుటీర, ఉత్పాదక రంగాలకు రుణాలు అందిస్తారు. ముఖ్యంగా:
- వ్యవసాయ, దాని అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.
- మునగ సాగు/ప్రాసెసింగ్, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల (మష్రూమ్) ఉత్పత్తి.
- నారు పెంచే నర్సరీలు, సోలార్ డ్రయ్యర్లు, రక్షిత సాగు విధానాలు.
- చేపల ప్రాసెసింగ్ వంటి ఉపాధి మార్గాల ఏర్పాటుకు ఈ పథకం కింద ప్రత్యేకంగా ఆర్థిక భరోసా కల్పిస్తారు.
వెలుగు అధికారుల అండ
మహిళలకు దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఈ రుణాల కోసం అవసరమయ్యే ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారీలోనూ, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ దరఖాస్తుల పూర్తి ప్రక్రియలోనూ సెర్ప్ పరిధిలోని 'వెలుగు' విభాగం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మహిళలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆ ప్రకటనలో హామీ ఇచ్చారు.














Click it and Unblock the Notifications