తెలంగాణ టిడిపి నేతలపై టిఆర్సిసి ధ్వజం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకులపై తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమన్వయ కమిటీ (టి ఆర్సిసిసి) నాయకులు బుధవారం విలేకరుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. పదవుల కోసం తెలంగాణ ఊసెత్తకూడదని టి ఆర్సిసిసి నిర్ణయం తీసుకున్నదని తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన విమర్శపై టి ఆర్సిసిసి నాయకులు జి. చిన్నారెడ్డి, ఎం. కోదండరెడ్డి తీవ్రంగా దాడి చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని తెలుగుదేశం నాయకులు అధికారం కోల్పోగానే తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారని వారన్నారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నదని వారు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం నాయకులు తమ నేత నారా చంద్రబాబునాయుడితో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాయిస్తే తాము వారితో కలిసి పని చేయడానికి కూడా సిద్ధమేనని వారన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పదవులు పోతాయని తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు నోరు మూసుకున్నారని వారన్నారు.