వర్గీకరణ ఒక్క రోజులో తేలేది కాదు: వైయస్
కర్నూలు: షెడ్యూల్డ్ కులాల (యస్సీ) రిజర్వేషన్ల వర్గీకరణ ఒక్క రోజులో తేలేది కాదని ముఖ్యమంత్రి డాకర్ట్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. వర్గీకరణపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (యం ఆర్పియస్) నేత మంద కృష్ణమాదిగ ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం సరి కాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గొంతు మీద కత్తిపెడితే సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు.
తమ పరిమితులు తమకుంటాయని, వర్గీకరణ కోసం అఖిల పక్ష బృందం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుందని, అందుకు ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్ అందుబాటులో ఏ రోజు ఉంటారనే వంటి విషయాలను కూడా చూసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కొందరు నేతలు ఈ విషయంలో రాజకీయం చేయడం సరి కాదని ఆయన అన్నారు. ఇదిలావుంటే, ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కేంద్ర న్యాయసలహా కోసం ఢిల్లీకి ఐ ఎయస్ అధికారిని పంపాలని నిర్ణయించినట్లు మున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు హైదరాబాద్లో చెప్పారు.
లౌకిక విధానాల పరిరక్షణ కోసం వామపక్షాలతో కలిసి పని చేస్తామని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో కూడా మతతత్వాన్ని ఓడించేందుకు వామపక్షాలతో కలిసి పని చేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వం నుంచి వైదొలగాలని మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర సమితికి అల్టిమేటం జారీ చేయడం సబబు కాదని ఆయన అన్నారు. దౌర్జన్యం చేయడం, బెదిరించడం ప్రజాస్యామ్య విరుద్ధమని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు చట్టబద్ధంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. జర్నలిస్టులపై పోలీసు దాడులపై తాను వ్యాఖ్యానించేదేమీ లేదని ఆయన అన్నారు. ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంపై జులై నెలాఖరులోగా తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కొందరు ముస్లిం ప్రతినిధులు కలిసినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు. బిసి కమీషన్ పూర్తి నివేదిక అందిన వెంటనే రిజర్వేషన్ల కల్పనపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
గ్రూప్ వన్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై రెండు రోజుల్లో సబ్జక్టు నిపుణలతో కమిటీ వేస్తామని ఆయన చెప్పారు. గ్రూప్ వన్ అభ్యర్థులు ఆయనను కలిసినప్పుడు ఆయన ఆ విషయం చెప్పారు.












Click it and Unblock the Notifications
