నేను బానిసను కానంటూ సంతోష్ తిరుగుబాటు
హైదరాబాద్: తాను బానిసను కానని, తనకూ కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్)కు చెందిన రాష్ట్ర మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి అన్నారు. మిగతా ఐదుగురు టి ఆర్యస్ మంత్రులతో పాటు రాజీనామా చేయకుండా ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఎవరో రాజీనామా ఆదేశించినంత మాత్రాన తాను మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముందు కేంద్ర మంత్రి పదవుల నుంచి కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్ర వైదొలగాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో, తమ నాయకుడు కె. చంద్రశేఖర్ రావుతో మాట్లాడిన తర్వాత అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు.
తాను అవసరమైతే మంత్రి పదవులకే కాదు, శాసససభ సభ్యత్వాలకు, లోక్సభ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేయాలని, అందరూ ఈ రాజీనామాలు చేయాలని ఆయన అన్నారు. మంత్రి వర్గంలో చేరవద్దని తాను ముందే చెప్పానని, తన మాటను పట్టించుకోకుండా మంత్రి వర్గంలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. మంత్రి వర్గంలో చేరుతున్నప్పుడే ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందని తెలుసునని ఆయన అన్నారు. తాను పార్టీకి, పార్టీ నాయకత్వానికి కట్టుబడి ఉంటానని, అయితే ప్రజాస్వామిక పద్దతిలో చర్చించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. తాను బానిసత్వానికి కట్టుబడి ఉండనని, ప్రజాస్వామ్య పద్దతిలో నిర్ణయాలు జరగాలని ఆయన అన్నారు.
సంతోష్ రెడ్డి రాజీనామా చేస్తారని టి ఆర్యస్ మంత్రులు చెప్పారు. చంద్రశేఖర్రావుతో మాట్లాడిన తర్వాత రేపు సంతోష్ రెడ్డి రాజీనామా చేస్తారని రాజీనామా చేసిన మంత్రి చంద్రశేఖర్ చెప్పారు.