రాజీనామాలపై గవర్నర్ అడిగారు, చెప్తా: వైయస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) మంత్రుల రాజీనామాలపై తగిన సమయంలో స్పందిస్తానని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. టి ఆర్యస్ మంత్రులు రాజీనామాలు సమర్పించిన కొద్దిసేపటికే ఆయన గవర్నర్ సుశీల్కుమార్ షిండేను కలిశారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరింది. ముఖ్యమంత్రి ఈ సాయంత్రం ఐదు గంటలకు విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఒక వైపు టి ఆర్యస్ మంత్రుల రాజీనామాలు, మరో వైపు ఆర్టీసి సమ్మె నేపథ్యంతో పరిస్థితిని వివరించేందుకు, తన విదేశీ పర్యటన గురించి తెలియజేసేందుకు ముఖ్యమంత్రి గవర్నర్ను కలిశారు.
టి ఆర్యస్ మంత్రుల రాజీనామాలపై గవర్నర్ తన అభిప్రాయం కోరారని, మంచీచెడులు ఆలోచించి వీలైనంత త్వరలో తన అభిప్రాయం తెలియజేస్తానని గవర్నర్కు చెప్పానని ఆయన అన్నారు. గవర్నర్తో సమావేశమైన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజీనామాలు ఆమోదించాలని చెప్పారా, వద్దని చెప్పారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. రాజశేఖర్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చే వరకు గవర్నర్ టి ఆర్యస్ మంత్రుల రాజీనామాలను ఆమోదించకపోవచ్చునని భావిస్తున్నారు.