నక్సల్స్పై చర్చకు అఖిలపక్షం: బిజెపి డిమాండ్
విజయనగరం: నక్సల్స్ పట్ల అనుసరించాల్సిన వైఖరిపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల పక్షసమావేశం ఏర్పాటు చేయడానికి ముందు ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. పార్టీ సమావేశంలో పాల్గొనడానికి బుధవారం ఇక్కడికి వచ్చిన ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
నక్సల్స్ పట్ల అనుసరించాల్సిన వైఖరిపై రాజకీయ పార్టీలన్నీ ఒక అభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నక్సల్స్ పట్ల అన్ని రాజకీయ పార్టీలు అవసరాన్ని బట్టి తమ వైఖరులను మార్చుకుంటూ వస్తున్నాయని, బిజెపి ఒక్కటే మొదటి నుంచి కచ్చితమైన విధానాన్ని అనుసరిస్తూ వస్తోందని ఆయన అన్నారు. అధికారం కోసం రాజకీయ పార్టీలు ఎటు పడితే అటు మాట్లాడుతూ వస్తున్నాయని ఆయన అన్నారు. పూటకో మాట మాట్లాడటం వాటికి అలవాటయిందని ఆయన అన్నారు. నక్సలైట్లే దేశభక్తులను ఒక పార్టీ నాయకుడంటే, తాను కూడా నక్సలైట్ల సానుభూతి పరుడనని మరో పార్టీ మంత్రి అన్నారని, ఇలా ఒక విధానమంటూ లేకుండా మాట్లాడటం సరైంది కాదని ఆయన అన్నారు.