నక్సల్స్పై నిషేధం దిశగా అడుగులు
హైదరాబాద్: మావోయిస్టులపై నిషేధం విధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్తో ఫోన్లో మాట్లాడారు. దేశవ్యాప్తంగా మావోయిస్టులపై నిషేధం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎందుకు ఉండకూదని శివరాజ్ పాటిల్ రాజశేఖర్ రెడ్డితో అన్నట్లు సమాచారం. శివరాజ్ పాటిల్ మాటలతో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమావేశమై మావోయిస్టులపై నిషేధం విధించే విషయంపై చర్చించారు. మావోయిస్టులపై కేంద్ర నిషేధం విధించినందువల్ల రాష్ట్రం ప్రత్యేకంగా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని, నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్రం ఒక ప్రకటన చేస్తే చాలునని కొంత మంది ఉన్నతాధికారులు అన్నట్లు తెలుస్తోంది.
కాగా, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి హోం మంత్రి కె. జానారెడ్డికి సూచించినట్లు తెలిసింది. ఈ సూచనతో జానారెడ్డి ఫోన్ రాజకీయ పార్టీల అభి6పాయాలను తెలుసుకుంటున్నారు. నిషేదాన్ని వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. మౌలిక సమస్యలను పరిష్కరించుకుండా మావోయిస్టులపై నిషేధం విధించినంత మాత్రాన ప్రయోజనం ఉండదని ఆ పార్టీలంటున్నాయి. నక్సల్స్ సమస్య రాజకీయ పరిష్కారం మాత్రమే సాధ్యమని, నిషేధం వల్ల సమస్య పరిష్కారం కాదని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపి ఐ) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నారాయణ అన్నారు. 30 ఏళ్లుగా ఆయుధాలతో నక్సలైట్లను అణచివేయడానకి ప్రయత్నిస్తోందని, మావోయిస్టులు తుపాకి ద్వారా రాజ్యాధికారం సంపాదిస్తామని అంటున్నారని, ఇరు పక్షాలు కూడా ఏ మాత్రం ఫలితం సాధించలేకపోయాయని ఆయన అన్నారు.
మౌలిక సమస్యలు పరిస్కారం చేయకుండా నక్సలిజానికి పరిష్కారం లభించదని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. భూపంపకం నామమాత్రంగా జరుగుతోందని, నిరుద్యోగులకు ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోతోందని, నిర్వాసితులను సమస్యలను పరిష్కరించడం లేదని, ఇలా ఏ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించడం లేదని, ఈ సమస్యలను పరిష్కరించుకండా నక్సలిజాన్ని పరిష్కరంచలేమని ఆయన అన్నారు. బూటకపు ఎన్కౌంటర్లు, నిషేధం వంటి ద్వారా నక్సలైట్ సమస్యకు పరిష్కారం లభించదని ఆయన అన్నారు.
చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) ఇప్పటికే ప్రకటించింది. ఇరువైపుల నుంచి హింస ఆగిపోవాలని ఆ పార్టీ అభిప్రాయడుతోంది.