నిషేధంపై ప్రజలకు జవాబు చెప్పాలి: బాబు
నల్లగొండ/హైదరాబాద్: మావోయిస్టులపై నిషేధం విధించడంపై వ్యాఖ్యానించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిరాకరించారు. నిషేధంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. నక్సల్స్ను ఎదుర్కోవడానికి గిరిజన బెటాలియన్ ఏర్పాటు నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. నక్సల్స్ను ఎదుర్కోవడానికి గిరిజనులను ముందుంచడం సరి కాదని ఆయన అన్నారు. "నక్సల్స్తో చర్చలు జరిపి ఏం సాధించారు? చివరికి నిషేధం విధించారు కదా! అని ఆయన అన్నారు.
మావోయిస్టులపై నిషేధం విషయంలో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు నిరాకరించారు. ప్రభుత్వం నిషేధం విధించే విషయంపై చర్చించడానికి తలపెట్టిన అఖిల పక్ష సమావేశానికి హాజరు కాకూడదని కూడా తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే అఖిలపక్ష సమావేశం ఏదీ ఏర్పాటు చేయకుండానే ప్రభుత్వం నిషేధం విధించింది. నక్సలైట్ల పట్ల వ్యవహరించే విషయంలో తమను ప్రభుత్వం ఎప్పుడూ సంప్రదించలేదని, ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని తెలుగుదేశం శాసనసభా పక్షం ఉపనాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తాము రాష్ట్రంలో శాశ్వత శాంతి స్థాపనను కోరుకున్నామని, శాంతిని నెలకొల్పడానికి ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు తాము మద్దతు ఇచ్చామని ఆయన అన్నారు. నక్సల్స్ పట్ల వ్యవహరించే విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని ఆయన అన్నారు. వోక్స్ వ్యాగన్ కుంభకోణం కేసును నీరు గార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఈ కేసుకు సంబంధించి చాలా మందిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని ఆయన అన్నారు.