నాలుగు పార్టీలతో పొత్తులుంటాయి: కెకె
హైదరాబాద్: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ, సిపియం, తెలంగాణ రాష్ట్ర సమితి, మజ్లీస్లతో పొత్తు వుంటుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు చెప్పారు. ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. న్యూఢిల్లీ నుంచి తిరిగివచ్చిన అనంతరం శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుల విషయమై తాను పార్టీ అధిష్ఠానవర్గంతో చర్చించలేదని ఆయన అన్నారు. ఇవి స్థానిక సంస్థల ఎన్నికలని, అందువల్ల అధిష్ఠానంతో చర్చించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా అధిష్ఠానవర్గానికి తెలియజేస్తామని ఆయన వివరణ ఇచ్చారు.
విప్లవ రచయితల సంఘం (విరసం)పై నిషేధం విధించడం సరైంది కాదని, ఇది తన వ్యక్తిగతాభిప్రాయమని ఆయన అన్నారు. విరసంలోని ఒకరిద్దరు ఏవో కార్యక్రమాలకు పాల్పడినంత మాత్రాన సంస్థను నిషేధించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి బిల్లుకు అవసరమైన మెజారిటీ తమకు ఉందని, అయితే ఒకటి రెండు పార్టీలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక, సోనియా గాంధీ నిర్ణయం వెలువడాల్సి ఉందని ఆయన అన్నారు.