కోర్టుల అక్షింతలు వైయస్కు అవమానకరం: నరేంద్ర
హైదరాబాద్: న్యాయస్థానాల నుంచి ఎదురవుతున్న పరిణామాలు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి అవమానకరంగా పరిణమించాయని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలు వేస్తున్న అక్షింతల వల్ల వైయస్ ప్రభుత్వం అవమానకరమైన పరిస్థితిలో పడిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్లోనే కొందరికి అనుమానాలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. న్యాయస్థానాల నిర్ణయాల వల్ల వైయస్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని ఆయన అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్, విప్లవ రచయితల సంఘం (విరసం)పై నిషేధం వంటి విషయాల్లో న్యాయస్థానాల నిర్ణయాలు, కాంగ్రెస్లోని పి. జనార్దన్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్ వంటివారి వ్యతిరేకత వైయస్ ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకతను ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని, కాంగ్రెస్ నాయకులను ఆదేశిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ అంశంపై తీర్మానం చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. అన్ని మున్సిపాలిటిలతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.